ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు.. 13 మంది మృతి-day after operation sindoor pak again resorts to shelling india retaliates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు.. 13 మంది మృతి

ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు.. 13 మంది మృతి

HT Telugu Desk HT Telugu

భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. భారత్ దీనికి ఎలా సమాధానం చెబుతోందో ఇక్కడ తెలుసుకోండి.

పూంచ్ జిల్లాలో బుధవారం పాకిస్తాన్ నుంచి షెల్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం (PTI)

మే 7 అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పులు జరిపింది. భారత సాయుధ దళాలు ఈ కాల్పులకు తగిన ప్రతిఘటన ఇచ్చాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సేనలు చిన్నచిన్న ఆయుధాలతో పాటు ఆర్టిలరీ గన్స్‌తో కాల్పులు జరిపారు.

'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా భారత సాయుధ దళాలు పొరుగు దేశంలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ఒక రోజు తర్వాత ఈ కాల్పులు జరిగాయి.

మధ్యరాత్రి తర్వాత కర్నా ప్రాంతంలో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ షెల్స్, మోర్టార్‌లతో కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు.

“మే 07-08, 2025 రాత్రి, పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలో ఎల్‌ఓసి వెంబడి చిన్న ఆయుధాలు, ఆర్టిలరీ గన్స్‌తో కాల్పులు జరిపింది. భారత సైన్యం తగిన విధంగా ప్రతిస్పందించింది” అని సైనిక వర్గాలు తెలిపాయి.

బుధవారం, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేయగా, పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసి వెంబడి ఉన్న గ్రామాలపై భారీ మోర్టార్ దాడి చేసింది.

భారత దాడుల తర్వాత కృష్ణ ఘాటి, షాపూర్, మన్కోట్ (పూంచ్), లామ్, మంజకోట్, గంబీర్ బ్రాహ్మణ (రాజౌరి జిల్లా), కర్నా (కుప్వారా జిల్లా) ప్రాంతాల నుండి సరిహద్దు మీదుగా తీవ్రమైన కాల్పులు జరిగాయి.

13 మంది మృతి

పాకిస్తాన్ సైన్యం ఎల్‌ఓసి వెంబడి ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆర్టిలరీ, మోర్టార్ దాడులు చేయడంతో నలుగురు పిల్లలు, ఒక సైనికుడు సహా 13 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారు.

పాకిస్తాన్ జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇళ్ళు, వాహనాలు, ఒక గురుద్వారాతో సహా వివిధ భవనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో వందలాది మంది నివాసితులు భూగర్భ బంకర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది.

2021 ఫిబ్రవరి 25న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణకు నోచుకున్న తర్వాత ఇంత తీవ్రమైన కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.

పూంచ్ జిల్లాలో 13 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

బాలాకోట్, మెండర్, మన్కోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయంతో సహా పూంచ్‌లోని ఎల్‌ఓసి వెంబడి కాల్పులు జరిగాయి. దీంతో డజన్ల కొద్దీ ఇళ్ళు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఖండన

పూంచ్ పట్టణంలో ఒక గురుద్వారా, పక్కనే ఉన్న ఇళ్లపై ఆర్టిలరీ షెల్ పడటంతో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు చెందిన అనేక పార్టీలు ఈ ఘటనను ఖండించాయి.

Xలో షిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఇలా పోస్ట్ చేశారు, "పూంచ్‌లోని సెంట్రల్ గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్‌పై పాకిస్తాన్ దళాలు జరిపిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో భాయ్ అమ్రిక్ సింగ్ జీ (ఒక రాగి సింగ్), భాయ్ అమర్జీత్ సింగ్, భాయ్ రంజిత్ సింగ్ అనే ముగ్గురు అమాయక గుర్సిక్కులు ప్రాణాలు కోల్పోయారు." అని వివరించారు.

బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో సరిహద్దు కాల్పుల్లో ఐదుగురు పిల్లలు సహా పది మంది గాయపడ్డారు. రాజౌరి జిల్లాలో ముగ్గురు గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నా సెక్టార్‌లో కాల్పుల కారణంగా అనేక ఇళ్ళు కాలిపోయాయి.

(ఏజెన్సీల ఇన్‌పుట్‌లతో)

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.