DA hike : ఈసారి కరవు భత్యం ఎంత పెరుగుతుంది? 8వ పే కమిషన్ పరిస్థితేంటి?
DA hike 2025 : 2025 జనవరికి సంబంధించిన కరవు భత్యాన్ని ప్రభుత్వం ఎంత పెంచే అవకాశం ఉంది? 8వ పే కమిషన్ పరిస్థితేేంటి? వివరాల్లోకి వెళితే..
ఇంకొన్ని రోజుల్లో 2025లోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల చూపు కరవు భత్యం (డియర్నెస్ అలోవెన్స్)పై షిఫ్ట్ అయ్యింది. 2025 జనవరికి సంబంధించిన కరవు భత్యం ఎంత పెరుగుతుంది? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై పలు వార్తలు బయటకు వచ్చాయి.
డీఏ పెంపు ఎందుకు?
నిత్యం పెరిగే ద్రవ్యోల్బణం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ డీఏ పెంపు ప్రకటనలు చేస్తూ ఉంటుంది. రిటైల్ ధరల కదలికలను ట్రాక్ చేసే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా డియర్నెస్ అలొవెన్స్ (డీఏ)ను లెక్కిస్తారు.
కేంద్రం ప్రతి సంవత్సరం రెండుసార్లు కరవు భత్యాన్ని సవరిస్తుంది. తరచూ మార్చ్, అక్టోబర్లో ప్రకటనలు వెలువడతాయి. అయితే అవి జనవరి- జూన్, జులై- డిసెంబర్ నెలలను కవర్ చేస్తాయి. మార్చ్లో డీఏ పెంపు ప్రకటించినప్పటికీ సంబంధిత నిధులు జనవరి నుంచి లెక్కించి, మిగిలిన బకాయిలు జీతంతో పాటు పడతాయి. అక్టోబర్లో ప్రకటించే కరవు భత్యం పరిస్థితి కూడా ఇదే.
2024లో కరవు భత్యాన్ని కేంద్రం రెండుసార్లు పెంచింది. చివరిగా 2024 అక్టోబర్లో 3శాతం డీఏ పెంపుపై ప్రకటన చేసింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50శాతం నుంచి 53శాతానికి చేరింది.
జనవరి 2025లో డీఏ పెంపు ఎంత ఉంటుంది?
పలు నివేదికల ప్రకారం 2025 జనవరికి సంబంధించి కనీసం 3శాతం డీఏ పెంపు ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే.. ప్రస్తుతం 53శాతంగా ఉన్న డీఏ 56శాతానికి చేరుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మార్చ్లో లేదా ఆ తర్వాత వెలువడే ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
కరవు భత్యం ఒకవేళ నిజంగానే 3శాతం పెరిగి 56శాతానికి చేరితే.. ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్టే అవుతుంది. ఉదాహరణకు కనీస వేతం రూ. 18వేలు అనుకుంటే.. తాజా డీఏ పెంపు వల్ల మరో రూ. 540 చేరుతుంది. అదే గరిష్ఠంగా రూ. 2.5లక్షల తీసుకుంటున్న వారికి డీఏ పెంపుతో అదనంగా రూ. 7500 లభిస్తుంది. ఇక పెన్షనర్ల విషయానికొస్తే.. డీఏ పెంపుతో ఆదాయం రూ. 270 నుంచి రూ. 3750 వరకు పెరుగుతుంది.
8వ పే కమిషన్ పరిస్థితేంటి?
ప్రస్తుతం 7వ పే కమిషన్ ఉంది. కానీ 8వ పే కమిషన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. ఈ విషయంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్కి వెల్లడించారు.
2025 జనవరికి సంబంధించిన డీఏ పెరగడం ఉపశమనాన్ని కలిగించే విషయమే అయినా.. 8వ పే కమిషన్పై కేంద్ర వైఖరి ఉద్యోగులను నిరుత్సాహ పరిచే విధంగా ఉంది.
సంబంధిత కథనం