Monsoon delay: నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం; కారణం అదే..
Monsoon delay: జూన్ మొదటి వారంలోనే భారత్ లో అడుగుపెట్టాల్సిన నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుంది. అరేబియా సముద్రంలో నెలకొన్న వాయుగుండం కారణంగా నైరుతి రుతు పవనాల రాక మరో మూడు రోజులు ఆలస్యమవనుంది.
జూన్ మొదటి వారంలోనే భారత్ లో అడుగుపెట్టాల్సిన నైరుతి రుతుపవనాల (southwest monsoon) ఆగమనం మరింత ఆలస్యం కానుంది. అరేబియా సముద్రంలో నెలకొన్న వాయుగుండం కారణంగా నైరుతి రుతు పవనాల రాక మరో మూడు రోజులు ఆలస్యమవనుందని ప్రైవేట్ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ (Skymet) బుధవారం వెల్లడించింది. జూన్ 12 నాటికి ఇవి కేరళ తీరానికి పూర్తి స్థాయిలో చేరుతాయని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర తుపాను మారనున్న నేపథ్యంలో నైరుతి రుతు పవనాల ఆగమనం ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకడానికి మరో 2, 3 రోజులు పట్టే అవకాశముంది. రుతుపవనాల ఆగమనం అంచనా వేసిన దాని కన్నా ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. సాధారణంగా జూన్ 1వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరుతాయి. ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించి, విస్తారమైన వర్షాలకు కారణమవుతాయి. నైరుతి రుతు పవనాలు భారత వ్యవసాయ రంగానికి, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. భారతదేశ నీటి అవసరాల్లో దాదాపు 70% నైరుతి రుతుపవనాల ద్వారానే తీరుతాయి.
బిపోర్జాయ్ తుపాను
అరేబియా సముద్రంలో ఈ సంవత్సరం ఏర్పడిన తొలి వాయుగుండం బిపోర్జాయి. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించి అత్యంత తీవ్రమైన తుపానుగా మారనుందని వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరించింది. ఆ తరువాత మూడు రోజుల పాటు ఉత్తర, వాయువ్య దిశల్లో ఇది ప్రయాణిస్తుంది. ఈ తుపాను కారణంగా దక్షిణ భారత్, మధ్య భారత్ లపై రుతు పవనాల ప్రభావం తగ్గే ముప్పు ఉందని స్కైమెట్ హెచ్చరించింది. జూన్ నెలలో కరవాల్సిన సాధారణ వర్షపాతం కన్నా సుమారు 20% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల రైతులకు ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది. బిపోర్జాయ్ తుపాన్ కారణంగా ఉత్తర కేరళ, కర్నాటక, గోవా తీరాల్లో తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.