Election results 2023 : ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం..
Tripura election results 2023 : 3 ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి.
Election results 2023 : ఈశాన్య భారతంలో మరో కీలక ఘట్టానికి నేడు తెరపడనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. గెలుపుపై ఆయా రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..
Tripura election results 2023 : త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్లో 27న ఎన్నికలు ముగిశాయి. ఇక ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బాలెట్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. 8:30 నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
త్రిపురలో మొత్తం 87.76శాతం ఓట్లు పోలయ్యాయి. మేఘాలయ, నాగాలాండ్లో ఓటింగ్ శాతాలు వరుసగా 85.27, 85.90గా ఉన్నాయి. దేశంలో 2024 సార్వత్రికం వరకు వరుసగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ఇందులో గెలిచిన పార్టీలు.. ఎన్నికల యుద్ధంలో ముందంజలో ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
Meghalaya election results 2023 : ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. త్రిపురలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది. వరుసగా రెండోసారి ఇక్కడ కమలదళం అధికారాన్ని దక్కించుకోనుంది. ఇక నాగాలాండ్లో ఎన్డీపీపీ- బీజేపీ కూటమికి మెజారిటీ వరిస్తుంది. కాగా.. మేఘాలయ పరిస్థితులు మాత్రం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఇక్కడ హంగ్ ఏర్పడుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అభిప్రాయపడ్డాయి.
3 రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలను కూడా నిర్వహించింది ఎన్నికల సంఘం. తమిళనాడులోని ఈరోడ్ స్థానానికి, పశ్చిమబెంగాల్ లోని సాగర్ధిఘి స్థానానికి, జార్ఖండ్ లోని రామ్ గఢ్ స్థానానికి, మహారాష్ట్రలోని కస్బాపథ్, చించ్వాడ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెలువడనున్నాయి.