Congress president election : రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గెలుపెవరిది?
Congress president election : సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Congress president election : దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరగనుంది. శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫలితంగా 24ఏళ్ల తర్వాత.. గాంధీయేతరులు ఆ బాధ్యత తీసుకుంటున్నట్టు అవుతుంది.
ట్రెండింగ్ వార్తలు
సీక్రెట్ బ్యాలెట్..
సోమవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ కోసం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ బ్యాక్సులు ఇప్పటికే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలకు చేరుకున్నాయి.
మొత్తం మీద ఎలక్టోరల్ కాలేజీకి చెందిన 9వేల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు.. తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. సభ్యులు.. తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ‘టిక్’ మార్క్ పెట్టాల్సి ఉంటుంది.
Congress president election polling : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. థరూర్, ఖర్గేలు తమ తమ రాష్ట్రాల్లోని(త్రివేండ్రం- బెంగళూరు) కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీతో పాటు మరో 40 మంది కాంగ్రెస్ సభ్యులు.. కర్ణాటక బళ్లారి జిల్లాలోని క్యాంప్ సైట్లో ఓట్లు వేయనున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ మంగళవారం నాటికి ఢిల్లీ చేరుకుంటాయి. 19వ తేదీన.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఆరోజే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విజేతను ప్రకటిస్తారు.
ఈ ఎన్నిక చాలా కీలకం..
Rahul Gandhi : దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. పోటీ పడిన దాదాపు అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక కాంగ్రెస్లోని అంతర్గత కలహాలు నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటాయి. సీనియర్లు పార్టీని విడిచివెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది.
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని పార్టీ నుంచి తీవ్ర డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ ఆయన పోటీ చేయలేదు. సోనియా గాంధీ వయస్సు రిత్యా.. మరో వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు అందరి కళ్లు శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గేవైపే ఉన్నాయి. వీరిలో గెలిచిన వ్యక్తి.. కాంగ్రెస్ను మళ్లీ పునర్వైభవం తీసుకొస్తారని పార్టీ శ్రేణులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
సంబంధిత కథనం