Uddhav Thackeray Resigns: బల పరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
uddhav thackeray resign: ముఖ్యమంత్రి పదవికి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఆయన.. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
uddhav thackeray resign for cm post: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కాసేపటికే ఫేస్ బుక్ లైవ్ ద్వారా మాట్లాడారు. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బలపరీక్షపై సుప్రీం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లటించారు. ఈ సందర్భంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ప్రకటించారు. తనకు మద్దతు నిలిచిన కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీలకు ధన్యవాదాలు తెలిపారు. ఔరంగాబాద్ పేరు శంబాజీ నగర్ గా, ఉస్మాన్ బాద్ ను దారాశివ్ పేరు మార్చటం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందన్న ఆయన.. సొంత పార్టీ వాళ్లే తమను మోసం చేశారని వ్యాఖ్యానించారు.
'ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను. అనూహ్య పరిణామాల మధ్య అధికారంలోకి వచ్చాను. అదే రీతిలో అధికారం నుంచి తప్పుకున్నాను. మహారాష్ట్ర ప్రజలతోనే ఉంటాను. ఎక్కడికి వెళ్లను. మళ్లీ శివసేన భవన్ లోనే కూర్చుంటాను… ప్రజలను కలుస్తాను' - ఉద్దవ్ ఠాక్రే, శివసేన అధినేత
బీజేపీలో సంబరాలు… సీఎంగా ఫడ్నవీస్..!
మరోవైపు బీజేపీ క్యాంప్ లో సంబరాలు మొదలయ్యాయి. సీఎంగా ఉద్ధవ్ రాజీనామా చేయటంతో… ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. ముంబైలోని ఓ హోటల్ లో సమావేశమైన ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్... ఇతర నేతలతో సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు. ఫడ్నవీస్ కు మద్దతుగా పార్టీ నేతలు నినాదాలు చేశారు. ఇక ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారనే చర్చ నడుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల్లో 10 మందికి మంత్రి పదవులు వస్తాయన్న వార్తలు బయటికి వస్తున్నాయి.
రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష ఉన్న నేపథ్యంలో షిండే క్యాంప్ గౌహతి నుంచి బయల్దేరి గోవాకు చేరింది. రేపు మహారాష్ట్రకు చేరుకోనున్నారు. గురువారం జరిగే బలపరీక్షకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి భారీ భద్రతను కల్పించనున్నారు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.