చైనా నిర్వాకం.. గల్వాన్ సైనికుడి చేతికి ఒలింపిక్ టార్చ్.. సిగ్గుచేటన్న అమెరికా
చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. గల్వాన్ లోయలో ఇండియాపై అక్రమంగా దాడికి పాల్పడి గాయాల పాలైన వాళ్లలో ఓ ఆర్మీ ఆఫీసర్ చేతికి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికాలోని సెనేట్కు చెందిన ఓ సీనియర్ చట్టసభ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ట్రెండింగ్ వార్తలు
2020, జూన్లో గల్వాన్ లోయలో భారత్లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించగా.. మన జవాన్లు అడ్డుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రెజిమెంటల్ కమాండర్ ఇప్పుడు బీజింగ్ గేమ్స్కు టార్చ్బేరర్గా మారినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. బీజింగ్ గేమ్స్ను రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్న విమర్శలు చైనాపై వెల్లువెత్తుతున్నాయి.
నిజంగా సిగ్గుచేటు
ఇండియాపై 2020లో దాడికి పాల్పడిన, ఉయ్ఘర్ ముస్లింలపై మారణహోమానికి పాల్పడుతున్న ఓ మిలిటరీ కమాండర్ చేతికి వింటర్ ఒలింపిక్స్ టార్చ్ ఇవ్వడం సిగ్గుచేటు. ఉయ్ఘర్ల స్వేచ్ఛకు, ఇండియా సార్వభౌమత్వానికి అమెరికా మద్దతు కొనసాగుతుంది అని యూఎస్ సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు జిమ్ రీష్ ట్వీట్ చేశారు.
కీ ఫాబావో అనే ఆ మిలిటరీ కమాండ్.. గల్వాన్ లోయ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. చైనాకు చెందిన షార్ట్ ట్రాక్ స్కేటింగ్ ఒలింపిక్ ఛాంపియన్ వాంగ్ మెంగ్ నుంచి ఫాబావో టార్చ్ అందుకున్నాడు.
నిజానికి గల్వాన్ లోయ దాడిలో చనిపోయిన తమ సైనికుల వివరాలను కూడా చైనా గోప్యంగా ఉంచింది. కేవలం నలుగురే చనిపోయినట్లు బుకాయించింది. కానీ తాజాగా ఈ సంఖ్య 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది. కనీసం 38 మంది చైనా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది.