Chhattisgarh encounter : ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతం-chhattisgarh encounter 2 security personnel 12 maoists killed in bijapur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter : ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh encounter : ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతం

Sharath Chitturi HT Telugu
Updated Feb 09, 2025 01:09 PM IST

Chhattisgarh encounter : ఛత్తీస్​గఢ్​ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- 12 మంది మావోయిస్టులు హతం.
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- 12 మంది మావోయిస్టులు హతం. (PTI/File)

ఛత్తీస్​గఢ్​ బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సైతం మరణించారు.

మావోయిస్ట్​ ఏరివేత ఆపరేషన్​లో భాగంగా భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇంద్రావతి నేషనల్​ పార్క్​ ప్రాంతంలోని అడవుల్లో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్టు అధికారులు వివరించారు. గాయపడిన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వివరించారు.

మరణించిన మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

మావోయిస్టుల ఏరివేత..

ఇదే బీజాపూర్​లో గత వారం జరిగిన ఎన్​కౌంటర్​లో 8మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్ట్​ ఏరివేత ఆపరేషన్​లో భాగంగా భద్రతా దళాలు- నక్సలైట్ల మధ్య ఎదురుకార్పులు జరిగాయి. ఫలితంగా 8మంది మరణించారు.

గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం సమయంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్​ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) సిబ్బంది ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారని బస్తర్ రేంజ్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పీ తెలిపారు.

ఈ ఏడాది ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లతో 50కిపైగా మంది మావోయిస్టులు హతమయ్యారు. గత వారం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోలు చనిపోయారని మావోయిస్టులు ఒక ప్రకటనలో అంగీకరించారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటటర్ లలో 219 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

2026 నాటికి నక్సలిజం ఉండదని, ఉండకూండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా భద్రతా దళాలు గత కొంతకాలంగా మావోయిస్టులను ఏరివేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.