భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం చండీగఢ్, పాటియాలాలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. 3 సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిని భారత్ భగ్నం చేసిన కొద్ది గంటల్లోనే ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ సూచించారు. చండీగఢ్ లో గురువారం సాయంత్రం నుంచి బ్లాక్ అవుట్ పాటించారు.
దాడి జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ వార్నింగ్ వచ్చింది. సైరన్ మోగిస్తున్నారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డీసీ పేర్కొన్నారు. పాటియాలా వాసులు ఇళ్లలోనే ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.
పంజాబ్ ప్రభుత్వం వచ్చే మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని, పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించింది. ముందుజాగ్రత్త చర్యగా తార్న్ తరన్, ఫాజిల్కా జిల్లా అధికారులు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. ప్రజల సౌకర్యార్థం పంజాబ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంలో శనివారం వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ మారణకాండకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, పూంచ్, మెంధర్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, భారీ ఫిరంగులను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల తీవ్రతను పెంచింది.
సంబంధిత కథనం