చండీగఢ్, పాటియాలాలలో హై అలర్ట్; సైరన్ లతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు-chandigarh patiala on alert day after india thwart pak missile drone attack ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చండీగఢ్, పాటియాలాలలో హై అలర్ట్; సైరన్ లతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

చండీగఢ్, పాటియాలాలలో హై అలర్ట్; సైరన్ లతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Sudarshan V HT Telugu

భారత్ లోని జనావాసాలు లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత్ లోని పలు సరిహద్దు సమీప నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. చండీగఢ్, పాటియాలాలలో సైరన్ లను మోగించారు. శుక్రవారం ఉదయం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి వెళ్లవద్దని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ సూచించారు.

చండీగఢ్లో హై అలర్ట్ (Ravi Kumar/HT)

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం చండీగఢ్, పాటియాలాలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. 3 సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిని భారత్ భగ్నం చేసిన కొద్ది గంటల్లోనే ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ సూచించారు. చండీగఢ్ లో గురువారం సాయంత్రం నుంచి బ్లాక్ అవుట్ పాటించారు.

దాడి జరిగే అవకాశం

దాడి జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ వార్నింగ్ వచ్చింది. సైరన్ మోగిస్తున్నారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డీసీ పేర్కొన్నారు. పాటియాలా వాసులు ఇళ్లలోనే ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.

పంజాబ్ లో అత్యవసర చర్యలు

పంజాబ్ ప్రభుత్వం వచ్చే మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని, పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించింది. ముందుజాగ్రత్త చర్యగా తార్న్ తరన్, ఫాజిల్కా జిల్లా అధికారులు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. ప్రజల సౌకర్యార్థం పంజాబ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంలో శనివారం వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

భారత్, పాక్ ఘర్షణలు

ఏప్రిల్ 22న పహల్గామ్ మారణకాండకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, పూంచ్, మెంధర్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, భారీ ఫిరంగులను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల తీవ్రతను పెంచింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.