One Nation One Election : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును తీసుకురానున్న కేంద్రం!-centre to bring one nation one election bill in parliament winter session know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation One Election : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును తీసుకురానున్న కేంద్రం!

One Nation One Election : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును తీసుకురానున్న కేంద్రం!

Anand Sai HT Telugu
Dec 10, 2024 10:11 AM IST

One Nation One Election : ప్రస్తుతం ఒకే దేశం-ఒకే ఎన్నికపై ఆసక్తి నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశాపెట్టాలని చూస్తున్నట్టుగా సమాచారం.

వన్ నేషన్ వన్ ఎలక్షన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక దేశం, ఒకే ఎన్నిక బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికపై రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత చర్య కోసం బీజీపీ ప్రణాళికలు వేస్తోంది.

yearly horoscope entry point

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికను నిర్వహించడం ద్వారా ఎన్నికలను క్రమబద్ధీకరించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదన బీజేపీ ప్రభుత్వానికి కీలక ఎజెండాగా ఉంది. బిల్లుపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. చర్చల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు సిద్ధమైంది. అందరి అభిప్రాయాలను సేకరించేందుకు జేపీసీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్లు, మేధావులు, సాధారణ ప్రజలతో చర్చలు చేయనుంది.

బీజేపీ హయాంలో సెప్టెంబర్ 2023లో ఏర్పాటైన రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నివేదిక ప్రతిపాదించింది.

మొదటి దశ - లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నిక.

రెండో దశ - స్థానిక సంస్థల ఎన్నిక.

ఈ ప్రణాళికను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను చేర్చడానికి ఆర్టికల్ 327కి మార్పులతో సహా రాజ్యాంగ సవరణలను బిల్లు ప్రతిపాదిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో కలిపే ప్రతిపాదనకు ప్రధాన రాజ్యాంగ సవరణలు, కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం.

పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు భారత ఎన్నికల సంఘం అధికార పరిధిలోకి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్లు పర్యవేక్షిస్తాయి. ఈ టైమ్‌లైన్‌లను సరిగా పాటించడానికి ఇప్పటికే ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లకు జాగ్రత్తగా చర్చించడం, మార్పులు చేయడం అవసరం.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికల సంబంధిత అంతరాయాలను తగ్గించడం, పరిపాలనా ప్రయత్నాలను క్రమబద్ధీకరించడం, తరచుగా జరిగే ఎన్నికల ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇది పాలనను మెరుగుపరుస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఆచరణ, ఒకే ఎన్నిక ప్రభావం, ఇతర సవాళ్లపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విధానాన్ని కీలక అంశంగా పేర్కొంది. ఈ ప్రతిపాదనకు బీజేపీలోని పలువురి నుండి మద్దతు లభించినప్పటికీ, ఇతర రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏకకాల ఎన్నికలతో భారతదేశ ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం జమిలి ఎన్నికల లక్ష్యం. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం, పరిపాలనా భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.