Centre bans PFI: పీఎఫ్ఐని నిషేధించిన కేంద్రం.. ఐదేళ్లపాటు అమలు-centre bans popular front of india its affiliates for terror links ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Centre Bans Popular Front Of India Its Affiliates For Terror Links

Centre bans PFI: పీఎఫ్ఐని నిషేధించిన కేంద్రం.. ఐదేళ్లపాటు అమలు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 09:07 AM IST

Centre bans PFI: కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు నిషేధించింది. తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు (HT_PRINT)

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని సహచరులు, అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటిస్తూ నిషేధం విధించింది. తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్ల పాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అర్థరాత్రి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘పీఎఫ్ఐ, దాని సహచర లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను తక్షణమే చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది’ అని ఉత్తర్వులో పేర్కొంది.

పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాలు రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్-కేరళ సంఘాలను చట్టవిరుద్ధమైన సంఘాలుగా పేర్కొంటూ వాటిని నిషేధించింది.

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు, ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉన్నందున PFI, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది.

‘యూఏపీఏలోని సెక్షన్ 4 కింద చేసిన ఏదైనా ఉత్తర్వుకు లోబడి ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి ఐదేళ్ల వరకు ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం ఇందుమూలంగా నిర్దేశిస్తుంది..’ అని పేర్కొంది.

‘PFI, దాని అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్ల మధ్య స్పష్టమైన సంబంధాలను ఏర్పరచుకున్నాయి’ అని పేర్కొంటూ కేంద్రం తన ఏజెన్సీల దర్యాప్తును ఉటంకిస్తూ నిషేధాన్ని జారీ చేసింది.

‘పీఎఫ్ఐ యొక్క వ్యవస్థాపక సభ్యులలో కొందరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) నాయకులు, జమాత్-ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB)తో సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ రెండూ నిషేధిత సంస్థలు’ అని కూడా ఆరోపించింది.

‘అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ISIS)తో PFI అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అనేక ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది PFI కార్యకర్తలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలలో చేరడం ద్వారా ఇది రుజువు అవుతుంది..’ అని పేర్కొంది.

పీఎఫ్ఐ, దాని కార్యకర్తలు పదేపదే హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ఆయా నేరపూరిత హింసాత్మక చర్యలలో ఓ కళాశాల ప్రొఫెసర్ అవయవాలను నరికివేయడం, ఇతర విశ్వాసాలను సమర్థించే సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను దారుణంగా చంపేయడం, పేలుడు పదార్థాలను పొందడం వంటివి ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులను, స్థలాలను లక్ష్యంగా చేసుకుని ప్రజా ఆస్తులను నాశనం చేయడం.. వంటివి ఉన్నాయి..’ అని నోటిఫికేషన్ పేర్కొంది.

సంజిత్ (కేరళ, నవంబర్, 2021), వి.రామలింగం (తమిళనాడు, 2019), నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్.రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పుయారి (కర్ణాటక, 2016), శశి కుమార్ (తమిళనాడు, 2016), ప్రవీణ్ నెట్టారు (2022) హత్య కేసులు సహా పలు తీవ్రవాద చర్యల్లో కూడా పీఎఫ్ఐ కార్యకర్తలు నిందితులుగా ఉన్నారని తెలిపింది.

ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్‌ఐని నిషేధించాలని సిఫారసు చేశాయని కూడా పేర్కొంది.

WhatsApp channel