రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త స్కీమ్.. రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. అంతేకాదు..!-central government announces cashless treatment scheme for road accident victims nationwide check medical cover details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త స్కీమ్.. రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. అంతేకాదు..!

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త స్కీమ్.. రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. అంతేకాదు..!

Anand Sai HT Telugu

Central Government New Scheme : రోడ్డు ప్రమాద బాధితులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశంలో కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. కొన్ని నెలలుగా ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోంది.

सड़क दुर्घटना पीड़ितों को मिलेगा कैशलेस इलाज (road accident )

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 7 న జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని పునఃసమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పైలట్ ప్రాజెక్టులో పలు సవరణలు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు తక్షణ వైద్యం అందించడం, తద్వారా క్షతగాత్రులు మరణించకుండా నిరోధించడం, మరణాల సంఖ్యను తగ్గించడం ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు. ఈ పథకం కింద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు అందజేస్తామన్నారు.

ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆ సమయంలో పథకంలో కొన్ని లోపాలు బయటపడగా, వాటిని ఇప్పుడు సరిదిద్దారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో ఆగస్టు 1, 2024న చండీగఢ్, అస్సాంలో మంత్రిత్వ శాఖ ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అప్పటి నుండి ప్రభుత్వం దీనిని నిరంతరం మెరుగుపరుస్తోంది.

పథకానికి సంబంధించి ముఖ్య విషయాలు

రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు బాధితురాలికి చికిత్స అందిస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే వెసులుబాటు ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడిన వ్యక్తికి రూ.5,000 వరకు రివార్డు కూడా ఇస్తారు. అయితే ఈ రివార్డు మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత

2024లో 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని నితిన్ గడ్కరీ తెలిపారు. వీరిలో 30 వేల మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు సరిగా లేకపోవడంతో 10 వేల మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీనికితోడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల దాదాపు 3 వేల మంది మృతి చెందారు. ఇందులో ప్రమాద బాధితుల్లో 66 శాతం మంది 18-34 ఏళ్ల మధ్య వయస్కులే కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని గడ్కరీ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించి కొత్త విధానాన్ని రూపొందించారు.

ఈ సమావేశం సందర్భంగా పాత వాహనాల స్క్రాపింగ్ విధానాన్ని గడ్కరీ వివరించారు. స్క్రాపింగ్ వల్ల అల్యూమినియం, రాగి, స్టీల్, ప్లాస్టిక్ వంటి మెటీరియల్స్ రీసైకిల్ అవుతాయని చెప్పారు. ఈ విధానం కింద మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తామన్నారు. స్క్రాపింగ్ పాలసీ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వానికి రూ.18,000 కోట్ల అదనపు జీఎస్టీ ఆదాయం సమకూరుతుందని చెప్పారు.

అతిపెద్ద ఆటోమెుబైల్ పరిశ్రమ

భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో మూడో అతిపెద్ద పరిశ్రమగా మారిందని నితిన్ గడ్కరీ అన్నారు. 2014లో ఈ పరిశ్రమ మార్కెట్ పరిమాణం 7 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు అది 22 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఆటోమొబైల్ ఉత్పత్తిలో జపాన్‌ను భారత్ అధిగమించిందని చెప్పారు.

నగదు రహిత చికిత్స పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర సహాయం అందించడమే కాకుండా దేశంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. వీటితో పాటు స్క్రాపింగ్ పాలసీ, డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు వంటి కార్యక్రమాలు దేశ ఆటోమొబైల్, ఉపాధి రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.