2025 కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా మార్క్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంకొన్ని సీట్లల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో లిబరల్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందా? లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించాలా? లేక స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు.. మార్క్ కార్నీ గెలుపుతో ఇటీవలి కాలంలో బలహీనపడిన భారత్- కెనడా సంబంధాలవైపు ఫోకస్ షిఫ్ట్ అయ్యింది.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. 343 సీట్లున్న కెనడా పార్లమెంట్ని లిబరల్స్ దక్కించుకున్నారు. కానీ సీట్ల విషయంలో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి లిబరల్స్ పార్టీకి మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. లిబరల్స్ 163 చోట్ల గెలుపు/ లీడ్లో ఉండగా.. కన్జర్వేటివ్లు 146 సీట్ల దగ్గర ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల క్లోజ్ ఫైజ్ సాగుతోంది! 100 ఓట్ల తేడాతో గెలుపోటములు డిసైడ్ అవుతున్నాయి. మెజారిటీకి 172 సీట్లు కావాలి!
వాస్తవానికి ఇప్పటివరకు అధికారంలో ఉన్న లిబరల్స్ ఈసారి కెనడా ఎన్నికల్లో గెలవకపోవచ్చని అంచనాలు ఉండేవి. పెరిగిపోతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, నిరుద్యోగం, హౌజింగ్ సమస్యలు వంటివి ప్రతికూలంగా ఉన్నాయి. కానీ మార్క్ కార్నీ లిబరల్స్ గెలుపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కారణం అని చెబుతున్నారు. కెనడాను అమెరికాలో కలిపేస్తానని అనడంతో పాటు ఆ దేశంపై ట్రంప్ టారీఫ్లు, హెచ్చరికలతో విరుచుకుపడ్డారు. మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం వెనకడుగువేయకుండా.. 'మేక్ కెనడా స్ట్రాంగ్' నినాదంతో ముందుకువెళ్లారు. ఇది ప్రజలకు నచ్చిందని తెలుస్తోంది. ఆ తర్వాత లిబరల్స్ గెలుపు అంచనాలు పెరిగాయి.
వాస్తవానికి భారత్- కెనడాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ కెనడాలో యాక్టివ్గా ఉండే ఖలిస్థానీ ఉద్యమంలో చిరుకుగా ఉండే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో పరిస్థితులు మారిపోయాయి. అతని హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ.. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య బంధంం బలహీన పడింది.
కాగా.. అనంతరం కాలంలో ప్రభుత్వ, సొంత వైఫల్యాల మధ్య జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వచ్చిన మార్క్ కార్నీ.. కెనడా ఎన్నికలకు పిలుపునిచ్చి, ఇప్పుడు విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో కెనడా- భారత్ బంధంపై ఫోకస్ పడింది. మార్క్ కార్నీ గెలుపు ఇండియాకు మంచిదనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్తో బంధాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తామని మార్క్ కార్నీ ఇప్పటకే అనేకసార్లు సంకేతాలిచ్చారు.
"భారత్తో బలమైన బంధం చాలా కీలకం. భారత్తో కెనడా ప్రజలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి," అని అన్నారు.
న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత, ఖలిస్థానీ ఉద్యమానికి అనుకూలంగా ఉండే జగ్మీత్ సింగ్.. తాజాగా జరిగిన కెనడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమే కాదు, ఆయన పార్టీ కూడా ఘోర ప్రదర్శన చేసింది. 2021 ఎన్నికల్లో 20కిపైగా చోట్ల గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు 7 సీట్లకు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం