జస్టిన్ ట్రూడో స్వంత పార్టీ నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అసమ్మతి లిబరల్ ఎంపీలు అక్టోబర్ 28 నాటికి తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. ప్రధానిగా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. దీంతో స్వపక్షం నుంచే జస్టిన్ ట్రూడో ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
లిబరల్ ఎంపిలు తాజాగా సమావేశం అయ్యారు. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో లిబరల్ నాయకుడిగా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. అసమ్మతి ఎంపీలు తమ మనోవేదనలను ట్రూడోకు తెలియజేశారు. దీంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి బయటపడింది. బుధవారం సమావేశంలో ఎంపీలు తమ ఆందోళనలు, నిస్పృహలను నేరుగా పీఎం ట్రూడోకు తెలియజేశారు.
అక్టోబరు 28లోగా తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలని అసమ్మతి లిబరల్ ఎంపీలు ఆయనకు అల్టిమేటం ఇచ్చారు. దీంతో ట్రూడో తన సొంత పార్టీ నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు . బుధవారం జరిగిన కాకస్ సమావేశంలో ట్రూడో రాజీనామాకు సంబంధించిన కేసును వివరించే పత్రాన్ని కూడా సమర్పించారు. 24 మంది ఎంపీలు లిబరల్ నాయకుడిగా ట్రూడోను వైదొలగాలని పిలుపునిచ్చేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు సీబీసీ న్యూస్ నివేదించింది.
సమావేశంలో బ్రిటిష్ కొలంబియా ఎంపీ పాట్రిక్ వీలర్ ట్రూడో రాజీనామాకు అనుకూలంగా వాదించిన పత్రాన్ని సమర్పించారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో ఎంపీలు మాట్లాడేందుకు ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం ఇచ్చారు. దాదాపు 20 మంది మాట్లాడారు. వారిలో ఎవరూ క్యాబినెట్ మంత్రులు లేరు. వచ్చే ఎన్నికలలోపు పక్కకు తప్పుకోవాలని ట్రూడోను కోరేందుకు లేచి నిలబడ్డారని సమాచారం. అయితే చాలా మంది ఎంపీలు కూడా ప్రధానికి మద్దతుగా నిలిచారని తెలుస్తోంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని ట్రూడో గత ఏడాది కెనడా పార్లమెంట్లో ఆరోపించడంతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశం అన్ని ఆరోపణలను ఖండించింది. అబద్ధాలుగా పేర్కొంది. కెనడా తమ దేశంలో తీవ్రవాద, భారత వ్యతిరేక అంశాలకు చోటు కల్పిస్తోందని ఆరోపించింది.
2020లో భారత జాతీయ దర్యాప్తు సంస్థ టెర్రరిస్టుగా గుర్తించిన నిజ్జర్, గతేడాది జూన్లో సర్రేలోని గురుద్వారా వెలుపల కాల్పుల్లో చనిపోయాడు. ఈ మరణంపై దర్యాప్తులో కెనడా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను కూడా అనుమానించింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం మెుదలైంది.