మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్.. బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్
BPSC Aspirants Protest : బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బీపీఎస్సీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారితో వాగ్వాదం జరగడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్(సీసీఇ)ని మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) అభ్యర్థులు చేపట్టిన నిరసన పాట్నాలో తీవ్రరూపం దాల్చింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీలు ప్రయోగించి వాటర్ క్యానన్లను ప్రయోగించారు. గత 10 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు, బాపు పరీక్షా పరిసార్ పరీక్షా కేంద్రంలో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో మెుదలయ్యాయి.
డిసెంబరు 13న పాట్నాలోని బాపు సభాగర్ పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. అభ్యర్థులు పరీక్షను బహిష్కరించి నిరసనలు చేయడంతో ఆ కేంద్రంలో పరీక్షను రద్దు చేశారు. జనవరి 4న పునఃపరీక్ష జరుగుతుందని తర్వాత ప్రకటించారు. అయితే మొత్తం పరీక్షను రద్దు చేసి నిష్పక్షపాతంగా ఉండేలా తాజాగా నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే ముందు, విద్యార్థులు గాంధీ మైదాన్లో గుమిగూడారు. ముఖ్యమంత్రి నివాసం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇంకోవైపు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బీపీఎస్సీ అభ్యర్థుల మార్చ్ జరిగింది. పోలీసులతో జరిగిన ఘర్షణలో కొందరు అభ్యర్థులు గాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
అభ్యర్థుల నుంచి ఫిర్యాదులను తీసుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అభ్యర్థులు మాత్రం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. వారి ముందుకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ముఖ్యమంత్రి నివాసానికి మార్చ్కు ఒక రోజు ముందు ప్రశాంత్ కిషోర్ పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం విద్యార్థులు రాజ్భవన్కు వెళ్లాలనుకున్న మార్చ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం తమ డిమాండ్లను అందించడానికి ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని ప్రకటించారు. కచ్చితమైన నిర్ణయం తీసుకోకుంటే మరుసటి రోజు నిరసనను తిరిగి ప్రారంభిస్తారని కిషోర్ పేర్కొన్నారు. అయితే తర్వాత ప్రధాన కార్యదర్శితో సమావేశం ప్రతిపాదనను తిరస్కరించారు.