వారణాసి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు!-bomb threat on varanasi bengaluru indigo flight canadian detained check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వారణాసి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు!

వారణాసి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు!

Anand Sai HT Telugu

వారణాసి విమానాశ్రయంలో బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో కెనడియన్ పౌరుడు బాంబు బెదిరింపుతో గందరగోళం నెలకొంది. భద్రతా అధికారులు వెంటనే చర్య తీసుకుని విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఇండిగో విమానం(ప్రతీకాత్మక చిత్రం)

త్తరప్రదేశ్‌లోని వారణాసిలో బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు తీసుకెళ్తున్నానని చెప్పి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించాడు కెనడా జాతీయుడు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. తదుపరి విచారణ కోసం కెనడియన్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని ఒక విదేశీయుడు ప్రయాణికులతో చెప్పడంతో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. తరువాత ఆదివారం ఉదయం విమానాన్ని బెంగళూరుకు పంపారు. అదే సమయంలో పోలీసులు కెనడియన్ పౌరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శనివారం రాత్రి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. కెనడాకు చెందిన వ్యక్తిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా సంస్థలు కూడా అతన్ని విచారిస్తున్నాయి. ఇలా ఎందుకు బెదిరించాడో పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు?

భద్రతా అధికారులు ఆ కెనడియన్ పౌరుడిని ప్రశ్నిస్తున్నారు. బాంబు పుకారు తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి 'ఐసోలేషన్ వే'కి తరలించామని, అయితే ఎటువంటి పేలుడు పదార్థం లేదని విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు.

కెనడియన్ ప్రయాణికుడి మాటలతో ఇండిగో సిబ్బంది వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)కి బెదిరింపు గురించి తెలియజేసినట్లు పునీత్ గుప్తా తెలిపారు. ప్రోటోకాల్‌ల ప్రకారం విమానాన్ని తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సంస్థల నుండి అనుమతి పొందిన తర్వాత విమానం ఆదివారం ఉదయం బెంగళూరుకు బయలుదేరింది. ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది.

'ఈ సమాచారం ఇచ్చిన కెనడా పౌరుడిని పోలీసులకు అప్పగించారు. అన్ని భద్రతా సంస్థలు అతన్ని విచారించగా విమానాశ్రయ కార్యకలాపాలను ఆలస్యం చేయడానికి తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలింది. అతనిపై తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అవుతోంది. కెనడా హై కమిషన్‌కు కూడా సమాచారం వెళ్తుంది.' అని వారణాసిలోని గోమతి జోన్ డీసీపీ ఆకాష్ పటేల్ చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.