పాకిస్థాన్ లోని లాహోర్ లో గురువారం ఉదయం అత్యంత భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు గల కారణాలు, మృతుల సంఖ్య తదితర వివరాలు ఇంకా తెలియరాలేదు.
లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే సైరన్ మోగడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతం లాహోర్ యొక్క ఆధునిక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ కు సమీపంలో ఉంటుంది.
పహల్గామ్ మారణకాండకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను డీప్ స్ట్రైక్ క్షిపణులను ఉపయోగించి ధ్వంసం చేశాయి. మరోవైపు, లాహోర్, ఇస్లామాబాద్ లలోని గగనతలాన్ని పాకిస్తాన్ మూసివేసింది. లాహోర్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల్లోని అన్ని వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కరాచీ విమానాశ్రయం మాత్రం పనిచేస్తోంది.
సంబంధిత కథనం