60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న బీజేపీ సీనియర్ నేత; పెళ్లి కూతురు ఎవరంటే?-bjps dilip ghosh to tie the knot at 60 his bride to be recalls how they met ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న బీజేపీ సీనియర్ నేత; పెళ్లి కూతురు ఎవరంటే?

60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న బీజేపీ సీనియర్ నేత; పెళ్లి కూతురు ఎవరంటే?

Sudarshan V HT Telugu

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ 60 ఏళ్ల వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బీజేపీ కార్యకర్త రింకూ మజుందార్ ను ఏప్రిల్ 18, శుక్రవారం సాయంత్రం ఆయన వివాహం చేసుకుంటున్నారు.

60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్న బీజేపీ సీనియర్ నేత

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన దిలీప్ ఘోష్ వివాహం శుక్రవారం సాయంత్రం సాంప్రదాయ వైదిక వేడుకగా జరగనుంది. 60 ఏళ్ల దిలీప్ ఘోష్ 2021 నుంచి తనకు తెలిసిన పార్టీ కార్యకర్త రింకు మజుందార్ ను వివాహం చేసుకుంటున్నారు. సాధారణంగా దిలీప్ ఘోష్, రింకూ మజుందార్ మార్నింగ్ వాక్ సమయంలో కలుసుకునేవారని, కాలక్రమేణా వీరి మధ్య సంబంధాలు పెరిగాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

తన చమత్కార వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందిన ఘోష్ తన చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిగా ఉన్నారు. 2015 లో బిజెపిలో క్రియాశీలకంగా మారారు. అంతకుముందు, ఆరెస్సెస్ లో దేశవ్యాప్తంగా వివిధ హోదాలలో పనిచేశారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా, సిపిఐ (ఎం) స్థానంలో రాష్ట్రంలో పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా నిలిపిన ఘనత దిలీప్ ఘోష్ కు దక్కుతుంది.

అమ్మ కోరిక..

‘‘నేను పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మ కోరిక. అందుకే ఆమె కోరికను గౌరవించడానికి నేను పెళ్లి చేసుకుంటున్నాను. మునుపటిలాగానే క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతాను. నా వ్యక్తిగత జీవితం నా రాజకీయ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదు’’ అని ఘోష్ ఓ న్యూస్ ఛానెల్ తో అన్నారు. కోల్ కతాలోని న్యూటౌన్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం జరగనుందని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సహా బీజేపీ సీనియర్ నేతలు ఉదయం న్యూటౌన్ లోని ఘోష్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

ఐపీఎల్ మ్యాచ్ లో..

ఈ నెల ప్రారంభంలో దిలీప్ ఘోష్, రింకు మజుందార్ హాజరైన ఐపీఎల్ మ్యాచ్ సమయంలోనే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఖరగ్ పూర్ మాజీ ఎంపీ అయిన ఘోష్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఘోష్ బ్రహ్మచారి కాగా, మజుందార్ కు ఇది రెండో వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.

రింకూ మజుందార్ ఎవరు?

మహిళా మోర్చా (మహిళా విభాగం), ఓబీసీ ఫ్రంట్, హ్యాండ్లూమ్ సెల్ తో సహా రింకు మజుందార్ బీజేపీలో వివిధ కీలక పాత్రలను నిర్వహించారు. రింకూకు గతంలో వివాహమైందని, కోల్కతాలోని సాల్ట్ లేక్ లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న కుమారుడు ఉన్నాడని పీటీఐ తెలిపింది. ఏప్రిల్ 3న ఘోష్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన రోజే ఈడెన్ గార్డెన్స్ లో కనిపించడంతో ఘోష్ తో ఆమె సంబంధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.