BJP vs TMC : ‘గొటబాయకు పట్టిన గతే మోదీకి కూడా..’
BJP vs TMC : శ్రీలంకలో గొటబాయ రాజపక్సకు జరిగిందే ఇండియాలో ప్రధాని మోదీకి కూడా జరుగుతుందని టీఎంసీ ఆరోపించింది. ఇందుకు కారణాలను వివరించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ మరోమారు విరుచుకుపడింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అనుభవిస్తున్నదే.. మోదీకి కూడా జరుగుతుందని టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ఆరోపించారు. శ్రీలంక సంక్షోభం వేళ.. దేశాన్ని గొటబాయ విడిచిపెట్టి వెళ్లి పోయారన్న వార్తల నేపథ్యంలో అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
బీజేపీ వర్సెస్ టీఎంసీ..
పశ్చిమ్ బెంగాల్లో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య గత కొంతకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. కాగా.. ఈ నెల 11న.. కోల్కతాలోని సీల్డాహ్ మెట్రో స్టేషన్ ఆవిష్కరణ వేడుక జరగనుంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ఈ ప్రాజెక్టును ఆవిష్కరించనున్నారు. కానీ ఇందుకు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లభించలేదు.
ఈ క్రమంలోనే బీజేపీపై మండిపడ్డారు అలీ.
"రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు.. మమతా బెనర్జీ చేపట్టిన చర్యల వల్లే ఇప్పుడు ఆ మెట్రో స్టేషన్ సాధ్యమైంది. అలాంటిది.. ఈవెంట్కు మమతా బెనర్జీని పిలవకపోవడం అన్యాయమే. ప్రధాని మోదీ తప్పుగా ప్రవర్తిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే ప్రధానికి కూడా పడుతుంది," అని అలీ పేర్కొన్నారు.
మమతా బెనర్జీ మాత్రమే కాదు.. పశ్చిమ్ బెంగాల్లోని ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా మెట్రో స్టేషన్ ఆవిష్కరణకు కేంద్రం పిలవలేదు. దీనిపై టీఎంసీ మండిపడుతోంది.
కాగా.. ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్న కీలక కార్యక్రమంలో నుంచి కూడా మమతా బెనర్జీని తప్పించారు.
ఈ వ్యవహారంపై టీఎంసీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా సాగుతోంది. ఈ పద్ధతిని టీఎంసీయే మొదలుపెట్టిందని బీజేపీ గుర్తుచేస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మమత ఎప్పుడైనా అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నిస్తోంది కమలదళం.
శ్రీలంకలో ఏం జరుగుతోంది..
శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో నిరసనకారులు శనివారం అలజడులు సృష్టించారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో మరో వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులకు.. రూ. కోట్ల సంపద కనిపించినట్టు స్థానిక మీడియా చెబుతోంది!
శ్రీలంక సంక్షోభం వేళ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో నిరనసకారులు కరెన్సీ నోట్లను లెక్కపెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. ఆ నగదును నిరసనకారులు తీసుకోలేదని, వాటిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్టు డైలీ మిర్రర్ అనే వార్తాపత్రిక వెల్లడించింది.
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలోకి శనివారం చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఆదివారం కూడా అక్కడే ఉండిపోయారు. రెండు రోజులుగా అధ్యక్షుడి పాలేస్లో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. పరుపులు మీద పడుకుని 'గొటబాయా.. నీ పరుపు చాలా సౌకర్యంగా ఉంది. థాంక్యూ' అని సామాజిక మాధ్యమాల్లోకి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరికొందరు స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఈత కొడుతున్నారు.
సంబంధిత కథనం