ఇయర్ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్పై పబ్జీ గేమ్ ఆడారు- చివరికి రైలు కింద చితికిపోయి..
PUBG death in bihar : బిహార్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్పై కూర్చుని పబ్జీ గేమ్లో మునిగిపోయారు. ఇయర్ఫోన్స్ పెట్టుకోవడంతో ఎదురుగా వస్తున్న రైలు గురించి వారికి తెలియలేదు. చివరికి, ఆ ముగ్గురు రైలు కింద చితికిపోయారు.
బిహార్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లొ నిలిచింది! రైల్వే ట్రాక్పై పబ్జీ ఆడుకుంటుండగా.. ముగ్గురు యువకులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ జరిగింది..
బిహార్ పశ్చిమ్ చంపారణ్ జిల్లాలోని మాన్సా టోలా కిందకు వచ్చే నర్కటియాగంజ్- ముజాఫర్పూర్ రైల్ సెక్షన్పై గురువారం ఈ ఘటన జరిగింది. ముగ్గురు రైల్వే ట్రాక్పై కూర్చుని ఇయర్ఫోన్స్ పెట్టుకుని పబ్జీ ఆడటంలో మునిగిపోయారు. ఫలితంగా, ఎదురుగా వస్తున్న రైలు గురించి వారికి తెలియలేదు, శబ్దం వినిపించలేదు. కొన్ని క్షణాల్లోనే వారి మీద నుంచి రైలు దూసుకెళ్లింది. ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
రైల్వే ట్రాక్పై మృతదేహాలను చూసేందుకు స్థానికులు తరలివెళ్లారు. భారీ సంఖ్యలో గుమిగూడి, రైలు ప్రమాదంలో చితికిపోయిన మృతదేహాలను చూసి షాక్కు గురయ్యారు.
మృతులను రైల్వే గంటికి చెందిన ఫుర్ఖాన్ ఆలమ్, బరి టోలాకు చెందిన సమీర్ ఆలమ్, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, యువకుల మరణం వెనుక మరిన్ని కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు మృతదేహాలను ఆయా కుటుంబాలు తమ ఇళ్లకి తీసుకెళ్లిపోయాయి.
సదర్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ వివేక్ దీప్, రైల్వే పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.
"మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఆయా కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నాము. అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అని తెలుసుకునేందుకు బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాము. అయితే, రైల్వే ట్రాక్పై ఇయర్ఫోన్స్ పెట్టుకుని మొబైల్ గేమ్ ఆడారాని, రైలు ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని వివేక్ దీప్ తెలిపారు.
రైల్వే ట్రాక్ ఆటలాడుకోవడం అంటేనే ప్రమాదకరం. ఇక ఇయర్ఫోన్స్ పెట్టుకుని మరీ మొబైల్ గేమ్స్ ఆడటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఫోకస్ చేయాలని, ఏది మంచి? ఏది చెడు? ఏది సురక్షితం? ఏది ప్రమాదకరం? వంటివి నేర్పించాలని అధికారులు చెబుతున్నారు. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవని అంంటున్నారు.
అనేక సంవత్సరాలుగా ఈ పబ్జీ గేమ్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.. యూజర్స్పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. గేమ్ ఆడుతూ చాలా మంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు.. పబ్జీకి బానిసై.. దాని నుంచి బయటకు రాలేక ప్రాణాలు తీసుకున్నారు.
సంబంధిత కథనం