బిహార్లో ఒక వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతని రెండో భార్య దానికి అభ్యంతరం చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తి.. తన భార్యపై పెట్రోల్ పోసి, సిలిండర్ నుంచి గ్యాస్ వదిలిపెట్టి నిప్పంటించాడు! ఈ దారుణం శనివారం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటన నలంద జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది. నిందితుడు వికాస్ కుమార్కు ఐదేళ్ల క్రితం సునీత దేవి (25)తో వివాహమైంది. పెళ్లి అయిన తర్వాతే కుమార్కి అంతకుముందే పెళ్లయిందనీ, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదనీ తమకు తెలిసిందని సునీత తండ్రి చెప్పారు.
కుమార్ కుటుంబ సభ్యులు సునీతను తమతో కలిసి జీవించడానికి ఒప్పించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ వారు పుట్టిన కొద్దిసేపటికే చనిపోయారు. ఆ తర్వాత, కుమార్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం మొదలుపెట్టాడు. దీని కారణంగా సునీతకు, అతనికి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో సునీత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
గత నెల ప్రారంభమైన దుర్గా పూజ పండుగకు ముందు, కుమార్ సునీత ఇంటికి వెళ్లి, తనతో తిరిగి వచ్చేయాలని కోరాడు.
శనివారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో సునీత నుంచి తమకు ఫోన్ వచ్చిందని ఆమె సోదరుడు తెలిపారు. "కుమార్ నాపై పెట్రోల్ పోశాడు, నన్ను పెరట్లో బంధించాడు," అని ఆమె చెప్పింది. ఆ తర్వాత, అతను వంటగ్యాస్ స్టవ్ వాల్వులు తెరిచి, అగ్గిపుల్లను గీసి విసిరాడని సునీత కన్నీళ్లతో వెల్లడించింది.
తాను ఇక బతకనని సునీత తన కుటుంబ సభ్యులకు చెప్పిందనీ, ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయిందనీ ఒక అధికారి చెప్పారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. సునీత కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకునే సమయానికి, కుమార్- అతని కుటుంబ సభ్యులు సునీత మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సునీత కుటుంబం వస్తుండటం చూసి, వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
"ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించింది. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఆమె అత్తమామలు పరారీలో ఉన్నారు," అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్ కుమార్ పాండే తెలిపారు.
సంబంధిత కథనం