Bihar elections 2025 : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల- రెండు దశల్లో పోలింగ్​..-bihar assembly elections 2025 will be in 2 phases announces election commission of india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Elections 2025 : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల- రెండు దశల్లో పోలింగ్​..

Bihar elections 2025 : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల- రెండు దశల్లో పోలింగ్​..

Sharath Chitturi HT Telugu

243 అసెంబ్లీ సీట్లున్న బిహార్​లో ఎన్నికలకు సంబంధించి సోమవారం కీలక ప్రకటన చేసింది భారత దేశ ఎన్నికల సంఘం (ఈసీ). బిహార్​లో మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​..

బిహార్​ ఎన్నికల షెడ్యూల్​ని భారత దేశ ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం ప్రకటించింది. 243 సీట్లున్న బిహార్​ అసెంబ్లీకి మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 6, 11వ తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్​ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసీ తాజా ప్రకటనతో బిహార్​లో ఎన్నికల కోడ్​ నేడు అమల్లోకి వచ్చింది.

2025 బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు- కీలక తేదీలు..

మొదటి దశ:

  • సీట్లు- 121
  • గెజెట్​ నోటిఫికేషన్​- అక్టోబర్​ 10
  • నామినేషన్​కి చివరి రోజు- అక్టోబర్​ 17
  • నామినేషన్ల పరిశీలన- అక్టోబర్​ 18
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- అక్టోబర్​ 20
  • పోలింగ్​ తేదీ- నవంబర్​ 6

రెండో దశ:

  • సీట్లు- 122
  • గెజెట్​ నోటిఫికేషన్​- అక్టోబర్​ 13
  • నామినేషన్​కి చివరి రోజు- అక్టోబర్​ 20
  • నామినేషన్ల పరిశీలన- అక్టోబర్​ 21
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- అక్టోబర్​ 23
  • పోలింగ్​ తేదీ- నవంబర్​ 11
  • కౌటింగ్​ తేదీ- నవంబర్​ 14

2015లో బిహార్​ ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. 2020లో ఆ సంఖ్య 3కి తగ్గింది. ఈసారి కేవలం 2 దశల్లోనే బిహార్​ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు- ఈసీ ప్రకటన..

2025 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో 7.43 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ వెల్లడించారు. వీరిలో సుమారు 3.5 కోట్ల మంది మహిళలు, 14లక్షల మంది తొలిసారి ఓటర్లు ఉన్నట్టు వివరించారు. కాగా 14వేల మంది ఓటర్ల వయస్సు 100ఏళ్లు పైబడి ఉందని పేర్కొన్నారు. 90,712 పోలింగ్​ కేంద్రాలు ఉంటాయని తెలిపారు.

మరోవైపు ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అధికారి కూడా నిస్పక్షపాతంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించారు. ఫేక్​ న్యూస్​ని ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిల్లో సోషల్​ మీడియా బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

సాధారణంగా పోలింగ్​ కేంద్రాల్లో సెల్​ఫోన్స్​కి అనుమతి ఉండదు. కానీ ఈసారి.. పోలింగ్​ బూత్​ బయటి వరకు సెల్​ఫోన్స్​ని అనుమతిస్తామని జ్ఞానేశ్​ కుమార్​ వెల్లడించారు.

“సెల్​ఫోన్స్​ని ఇంట్లో పెడితే సమస్య. పోలింగ్​ కేంద్రాలకు తీసుకెళితే సమస్య. అందుకే ఈసారి.. కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాము. ఓటర్లు తమ మొబైల్స్​ని పోలింగ్​ బూత్​ బయట జమ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాము. లోపలికి వెళ్లి ఓటు వేసిన అనంతరం, వారు తిరిగి తమ ఫోన్స్​ని పొందొచ్చు,” అని ప్రధాన ఎన్నికల కమిషనర్​ వెల్లడించారు.

ఈ దఫా బిహార్​ ఎన్నికల్లో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, తగిన చర్యలు చేపట్టనున్నట్టు, ఫలితంగా ఎలక్షన్లు అత్యంత పారదర్శకంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తాయని ఈసీ తెలిపింది.

బిహార్​ రాజకీయ సమీకరణలు.. ఎవరి బలం ఎంత?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అధికార పక్షమైన ఎన్‌డీఏ కూటమికి, ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమికి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ జేడీయూ, దాని ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), ఇతర మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు, తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), ఇతర పక్షాలతో కూడిన ఇండియా కూటమి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను అధికారం నుంచి దించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో బీజేపీకి ప్రధాన బలంగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా గత కొన్ని నెలలుగా బిహార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త రాజకీయ శక్తి... మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ (జేఎస్పీ). తన సొంత రాష్ట్రం బిహార్ నుంచే ఆయన తన పూర్తిస్థాయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జన్ సూరజ్ పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన సంఖ్య 122.

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్‌డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సొంతంగా పోటీ చేసినా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత ఎల్జేపీ చీలిపోయింది. చిరాగ్ మామ పశుపతి పారస్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈసారి, హంగ్ తీర్పు వస్తే తాను "కింగ్‌మేకర్" అవుతానని చిరాగ్ పాశ్వాన్ ఆశిస్తున్నారు.

కూటముల్లో లేదా ఒంటరిగా రంగంలో ఉన్న ఇతర పార్టీలలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, వామపక్ష పార్టీలు ఉన్నాయి. వామపక్షాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)-లిబరేషన్ లేదా సీపీఐ (ఎంఎల్)-ఎల్ బీహార్‌లో ప్రముఖమైనది. అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం సైతం కీలకంగా మారే అవకాశం లేకపోలేదు.

2020 బిహార్ ఎన్నికల తర్వాత అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీకి ఉప ముఖ్యమంత్రులుగా సమ్రాట్ చౌధరి, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు.

జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీ రెబెల్స్‌ సహా ఎన్‌డీఏలోని ఇతర మిత్రపక్షాల బలం తొమ్మిదికి చేరింది. దీంతో ఎన్‌డీఏ కూటమి మొత్తం బలం 132కి చేరింది, ఇది మెజారిటీ సంఖ్య అయిన 122 స్వల్పంగా ఎక్కువ ఎక్కువ.

మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన ఆర్జేడీ, ప్రతిపక్షంలో ఉన్న మహాఘట్‌బంధన్ (మహా కూటమి)కి నాయకత్వం వహిస్తోంది. దీనికి ప్రస్తుతం 75 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 2020 ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్జేడీనే అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, ఫిరాయింపులు, ఉపఎన్నికల కారణంగా తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 78కి పెరిగింది.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సీపీఐ (ఎంఎల్)-ఎల్‌కు బిహార్ విధానసభలో 12 మంది సభ్యులు ఉన్నారు. మరో రెండు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

2020 ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ రెండుసార్లు పొత్తులు మార్చడం, ఎమ్మెల్యేలు ఆయనతో పాటు వర్గం మారడం వల్ల 2025 ఆగస్టు నాటికి ఈ సంఖ్యలు నిలిచాయి. 2020 ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.