Bihar Kurhani By-Election: సీఎం నితీశ్కు ఎదురుదెబ్బ.. బీజేపీతో విడిపోయాక..
Bihar Kurhani By-Election Result: బీజేపీతో విడిపోయాక రాష్ట్రంలో వచ్చిన తొలి ఉప ఎన్నికలో జేడీయూకు షాక్ తగిలింది. మహా కూటమిగా బరిలోకి దిగినా ఓటమి ఎదురైంది.
Bihar Kurhani By-Election Result: బిహార్ లోని కుర్హానీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఎదురుదెబ్బగా మారింది. సీఎం నితీశ్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ).. ఏడు పార్టీల మహా కూటమిగా ఓ అభ్యర్థిని బరిలోకి దింపింది. బీజేపీతో నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్నాక… బిహార్ లో వచ్చిన తొలి ఉప ఎన్నిక ఇది. దీంతో నితీశ్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కమలం పార్టీతో విడిపోయాక వచ్చిన ఈ ఉప ఎన్నికలను పరీక్షగా భావించారు. కానీ కుర్హానీ అసెంబ్లీ సీటు నితీశ్కు మరోసారి షాక్ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
బీజేపీకి జోష్
కుర్హానీ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి తరఫున పోటీని చేసిన జేడీయూ అభ్యర్థి మనోజ్ కుష్వారా ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కేదార్ గుప్తా విజయం సాధించారు. 3,662 ఆధిక్యం వచ్చింది. మెజార్టీ తక్కువే అయినా మహాకూటమిపై గెలవడం బీజేపీకి జోష్ తెచ్చింది.
‘తొలి పరీక్ష’లో..
సీఎం నితీశ్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీకి గుడ్బై చెప్పి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు.ఆ తర్వాత బిహార్ లో వచ్చిన తొలి ఉప ఎన్నికల కుర్హానీదే. దీంతో దీన్ని రెఫరండంగానూ భావించారు నేతలు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం నితీశ్ కూడా ఆ స్థానంలో ప్రచారం చేశారు. మిగిలిన అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీపై మనోజ్ కుష్వాహాను పోటీకి దించారు. అయినా నితీశ్కు ఎదురుదెబ్బే తగిలింది. తెగదెంపుల తర్వాత తొలి పరీక్షలో బీజేపీదే పైచేయి అయింది.
అవినీతి కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్నీ జైలు పాలై అనర్హత వేటుకు గురి కావటంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
అచ్చిరాని సీటు
కుర్హానీ అసెంబ్లీ నియోజకవర్గం సీఎం నితీశ్ కుమార్ పార్టీకి అచ్చిరాలేదు. చివరి మూడుసార్లు ఆయన నేతృత్వంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారు. 2015లో ఆర్జేడీతో కలిసి జేడీయూ పోటీ చేసినప్పుడు కేదార్ గుప్తా గెలిచారు. కానీ అప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థి. 2015 ఎన్నికల్లో బీజేపీతో కలిశారు నితీశ్ కుమార్. అప్పుడు ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన కేదార్ గుప్తా.. ఆర్జేడీ అభ్యర్థి అనిల్ చేతిలో ఓడారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉప ఎన్నికలోనూ ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున కేదార్ పోటీ చేశారు. జేడీయూ-ఆర్జేడీ సహా మహాకూటమి నిలిపిన అభ్యర్థిని ఓడించారు. దీంతో ఒకే స్థానంలో మూడుసార్లు నితీశ్కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
టాపిక్