Biden Xi : 'నిప్పుతో ఆడుకుంటే నాశనమైపోతారు'- బైడెన్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Biden Xi : బైడెన్- జిన్పింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. తైవాన్ విషయంలో బైడెన్కు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంద.
Biden Xi : తైవాన్ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ప్రత్యక్షంగా భేటీ అయ్యేందుకు నిర్ణయించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఫోన్ సంభాషణలో.. ఇరువురు అధ్యక్షులు ఈ మేరకు అంగీకరించారు.
యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి.. వచ్చే నెలలో తైవాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అదే జరిగితే.. తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ తరుణంలో బైడెన్- జిన్పింగ్ మధ్య సంభాషణ జరగడం, సమీప భవిష్యత్తులో కలిసేందుకు ఇద్దరు అంగీకరించడం సర్వత్రా చర్చలకు దారితీసింది.
"బైడెన్- జిన్పింగ్ మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. విభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రయోజనాల కోసం కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాధ్యక్షులు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యక్ష సమావేశం గురించి చర్చించారు," అని అధికారులు మీడియాకు తెలిపారు.
America China relation : అమెరికా- చైనా సంబంధాలు.. ఇరు దేశాలకే కాకుండా, ప్రపంచానికి ఎంతో ఉపయోగకరమని జిన్పింగ్కు బైడెన్ చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, నార్కొటిక్స్ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
చైనాలో తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ అయిన అమెరికన్ల విషయం, ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని సైతం జిన్పింగ్తో సంభాషణలో బైడెన్ లేవనెత్తారు.
కాగా.. తైవాన్ వివాదంపై అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
"వన్ చైనా విధానానికి అమెరికా కట్టుబడి ఉండాలి. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వకూడదు. నిప్పుతో ఆడుకుంటే.. నాశనమైపోతారు. ఈ విషయంలో అమెరికా స్పష్టంగా ఉండాలి. వన్ చైనా విధానంపైనే అమెరికా- చైనాల బంధానికి పునాది పడింది. దానినే కొనసాగించాలి," అని ఇరు దేశాధ్యక్షుల చర్చల్లో జిన్పింగ్ వ్యాఖ్యానించినట్టు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.
China Taiwan : తైవాన్ తమ దేశం అంతర్భాగమని చైనా చెబుతోంది. కానీ తమది స్వతంత్ర దేశమని తైవాన్ అంటోంది. తైవాన్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది! 'ఎవరు మద్దతిచ్చినా.. తైవాన్ను తమ భూభాగంలో కలిపేసుకుంటాం,' అని చైనా తేల్చిచెబుతోంది. ఈ క్రమంలోనే చైనా- తైవాన్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం.. జిన్పింగ్తో బైడెన్ చర్చలు జరపడం ఇది ఐదోసారి. చివరిగా.. మార్చ్ నెలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.
సంబంధిత కథనం