సిగరెట్​ కొనివ్వలేదని కోపం- బైక్​ మీద వెళుతున్న వ్యక్తిని చంపేశాడు! కారుతో ఢీకొట్టి..-bengaluru crime news techie run over after dispute over cigarette ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సిగరెట్​ కొనివ్వలేదని కోపం- బైక్​ మీద వెళుతున్న వ్యక్తిని చంపేశాడు! కారుతో ఢీకొట్టి..

సిగరెట్​ కొనివ్వలేదని కోపం- బైక్​ మీద వెళుతున్న వ్యక్తిని చంపేశాడు! కారుతో ఢీకొట్టి..

Sharath Chitturi HT Telugu

బెంగళూరులో షాకింగ్​ ఘటన జరిగింది! ఓ వ్యక్తి తన కారుతో ఓ బైక్​ని ఢీకొట్టాడు. బైక్​ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సిగరెట్​ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం ఇందుకు కారణం.

బెంగళూరులో దారుణ ఘటన..

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! సిగరెట్​ కొనివ్వలేదన్న కోపంతో, ఓ వ్యక్తి- మరో వ్యక్తిని తన కారుతో ఢీకొట్టి చంపేశాడు. వీరిద్దరికి అసలు పరిచయమే లేకపోవడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

విజరహళ్లికి చెందిన 29ఏళ్ల సంజీవ్​ ఓ టెక్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. మే10న సంజయ్​, తన స్నేహితుడు చేతన్​ పుజామథ్​తో కలిసి సిగరెట్​ తాగేందుకు అర్థరాత్రి వేళ ఆఫీస్​ నుంచి బైక్​ మీద బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి కనకపుర రోడ్డు దగ్గర ఉన్న వసంతపుర క్రాసింగ్​ వద్ద సిగరెట్​ కొని, తాగుతున్నారు. ఆ సమయంలో వారి ముందు ఒక కారు వచ్చి ఆగింది. విండో తీసిన డ్రైవర్​, కారు దిగకుండానే.. తనకు ఒక సిగరెట్​ కొనివ్వాలని సంజయ్​ని అడిగాడు. సంజయ్​ ఒప్పుకోలేదు. అంతేకాదు, కారులో నుంచి బయటకి రావడానికి బద్ధకమా అన్నట్టు మాట్లాడాడని సమాచారం.

ఇది కారులో కూర్చున్న వ్యక్తికి కోపం తెప్పించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరిని విడదీసేందుకు చేతన్​ సహా స్థానికులు ప్రయత్నించారు. కొంతసేపటికి ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే, సంజీవ్​- చేతన్​లను ఆ వ్యక్తి వెంబడించాడు. సంజీవ్​ తన బైక్​ తీసి ఆఫీసుకు వెళుతుండగా, ఆ వ్యక్తి వెనుక నుంచి ఆ వెహికిల్​ని బలంగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో సంజీవ్​ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన జరిగిన సమయంలో బైక్​ వెనక కూర్చున్న చేతన్​కి కూడా బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీసీటీవీ ఫూటేజ్​ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ లభించింది. అతని పేరు ప్రతీక్​. వయస్సు 31ఏళ్లు. రాజరాజేశ్వరి నగర్​లో నివాసముంటున్నాడు. అతను ఒక ప్రైవేట్​ కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తున్నాడు.

కాగా ఘటన జరిగిన సమయంలో ప్రతీక్​ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ తర్వాత తన భార్యతో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని సమాచారం.

పోలీసులు ప్రతీక్​ని అరెస్ట్​ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ ఇప్పుడు వైరల్​ మారింది. ఈ వార్త విన్న ప్రజలు షాక్​కి గురువుతున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.