Recharge break for employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 11 రోజుల రీఛార్జ్ బ్రేక్
Recharge break for employees: ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రీఛార్జ్ బ్రేక్ పేరుతో ఏకంగా 11 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ షాపింగ్ సైట్ మీషో తన కంపెనీ ఉద్యోగులందరికీ 11 రోజుల ‘రీసెట్ అండ్ రీఛార్జ్ బ్రేక్’ ప్రకటించింది. గత ఏడాది కూడా ఇదే పద్ధతిలో బ్రేక్ ఇచ్చింది. అక్టోబరు 22 నుంచి నవంబరు 1 వరకు ఈ బ్రేక్ వర్తిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
మీషో ఫౌండర్, సీటీవో సంజీవ్ బాన్వల్ ట్విటర్లో ఈ ప్రకటన చేశారు. ‘వరుసగా రెండో ఏడాది 11 రోజుల బ్రేక్ ప్రకటిస్తున్నాం. రాబోయే పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దృష్ట్యా తగిన విశ్రాంతి కోసం అక్టోబరు 22 నుంచి నవంబరు 1 వరకు బ్రేక్ ఇస్తున్నాం..’ అని తెలిపారు.
మీషో గతంలో బౌండరీలెస్ వర్క్ప్లేస్ మోడల్, ఇన్ఫినిటీ వెల్నెస్ లీవ్, 30 వీక్ జెండర్ న్యూట్రల్ పేరెంటల్ లీవ్, 30 డే జెండర్ రీఅసైన్మెంట్ లీవ్ వంటి వినూత్న సంక్షేమ చర్యలు అమలు చేసింది.
ఫిబ్రవరిలో మీషో తన ఉద్యోగులందరికీ శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రకటించింది. ఉద్యోగులు ఇంటి నుంచి గానీ, ఆఫీస్ నుంచి గానీ, తమకు నచ్చిన ఏ ఇతర లొకేషన్ నుంచి గానీ పనిచేయొచ్చని ప్రకటించింది. కంపెనీలోని మొత్తం 1700 మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది.
‘మేం విభిన్న వర్క్ మోడల్స్పై అధ్యయనం చేశాం. ఆ తరువాత బౌండరీలెస్ అప్రోచ్ అమల్లోకి తెచ్చాం. భారత్ విత్ మీషో బిల్డ్ చేసేందుకు అంతర్జాతీయ నైపుణ్యాలు మాకు అందుబాటులోకి వస్తాయి..’ అని మీషో చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ తెలిపారు.
2015లో దీనిని ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు ఆత్రేయ్, సంజీవ్ బన్వల్ స్థాపించారు. తొలుత సోషల్ కామర్స్ యాప్గా ప్రారంభమై ఉత్పత్తిదారులను, రీసెల్లర్లను కలిపే వేదికగా పనిచేసింది.