Amit Shah meets Mamata at EZC meet: కోల్ కతా లో ఈజెడ్ సీ భేటీలో అమిత్ షా, మమత
Eastern Zonal Council meet: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ శనివారం కోల్ కతాలో జరిగిన ఒక సమావేశంలో కలిసి పాల్గొన్నారు.
Eastern Zonal Council meet: కోల్ కతాలో శనివారం ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(Eastern Zonal Council) సమావేశం జరిగింది. కౌన్సిల్ లోని రాష్ట్రాల మధ్య వివాదాలు, ఇతర సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
Mamata meets Amit Shah: ఒకే వేదికపై..
జోనల్ కౌన్సిల్ కు కేంద్ర హోం మంత్రి చైర్మన్ గా ఉంటారు. అలాగే, సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. శనివారం ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(Eastern Zonal Council) సమావేశం కోల్ కతాలో జరగడంతో చైర్మన్ హోదాలో అమిత్ సా, వైస్ చైర్ పర్సన్ హోదాలో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పాల్గొన్నారు. ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్(Eastern Zonal Council) సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షాకు మమత పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో రాష్ట్రాల తరఫున మమతతో పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఒడిశా మంత్రి హాజరయ్యారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం.
Zonal Councils: ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ?
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం - 1956 ప్రకారం 1957లో భారతదేశంలో జోనల్ కౌన్సిళ్లు(Zonal Councils) ఏర్పాటయ్యాయి. ఈస్టర్న్(Eastern), సదరన్(Southern), వెస్టర్న్(Western), నార్తర్న్(Northern), సెంట్రల్(Central) జోనల్ కౌన్సల్స్ గా వాటిని ఏర్పాటు చేశారు. ఈ జోనల్ కౌన్సిల్స్ కు కేంద్ర హోం మంత్రి చైర్మన్ గా ఉంటారు. అలాగే, సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. సభ్య రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను ఈ జోనల్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తారు. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ లో పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా సభ్య రాష్ట్రాలుగా ఉంటాయి.
Eastern Zonal Council meet: కోల్ కతా సమావేశంలో..
కోల్ కతాలోని రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన సమావేశంలో బొగ్గు గనులు, రైల్వే ప్రాజెక్టుల కోసం భూ సేకరణతో పాటు అటవీ అనుమతులు, అంతర్రాష్ట్ర నేరాల విచారణ, పశువుల స్మగ్లింగ్.. మొదలైన అంశాలపై చర్చించారు. సమావేశానికి ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు కేబినెట్ మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతర్రాష్ట్ర అంశాలపై సమన్వయం, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడం, కేంద్ర నిధుల పంపిణీ తీరు.. తదితర అంశాలపై కూడా చర్చించారు.