పరీక్షలో తప్పు రాశాడని కొట్టిన టీచర్​.. విద్యార్థి మృతి!-beaten by teacher up boy succumbs to injuries ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పరీక్షలో తప్పు రాశాడని కొట్టిన టీచర్​.. విద్యార్థి మృతి!

పరీక్షలో తప్పు రాశాడని కొట్టిన టీచర్​.. విద్యార్థి మృతి!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2022 06:59 PM IST

అతనో టీచర్​. విద్యార్థులు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత అతనిది. ఆ బాధ్యతను అతను చాలా సీరియస్​గా తీసుకున్నాడు! పరీక్షలో తప్పులు రాశాడన్న కారణంతో.. ఓ విద్యార్థిని చితకబాదేశాడు. ఆ 15ఏళ్ల బాలుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వీడాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

<p>టీచర్​ దెబ్బలకు బాలుడు మృతి!</p>
టీచర్​ దెబ్బలకు బాలుడు మృతి!

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో తప్పు రాశాడన్న కారణంతో.. ఓ విద్యార్థిని చితకబాదాడు ఓ టీచర్​. ఆ 15ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు!

పరీక్షలో తప్పు రాశాడని..!

ఔరయాలోని వైషోలి గ్రామంలో నివాసముంటున్న 15ఏళ్ల నిఖిల్​.. ఫపుండ్​ రోడ్డులోని ఆదర్శ్​ ఇంటర్​ కాలేజీలో చదువుకుంటున్నాడు. అతని తండ్రి రాజు దోహ్రే సమాచారం ప్రకారం.. సోషల్​ టీచర్​ అశ్విని సింగ్​.. ఈ నెల 7న ఓ పరీక్ష నిర్వహించాడు. పరీక్షలో నిఖిల్​ ఓ తప్పు రాశాడు. అందుకు కోపం తెచ్చుకున్న అశ్విని సింగ్​.. నిఖిల్​పై విరుచుకుపడ్డాడు. దారుణంగా కొట్టాడు. బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు.

ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు.. స్కూల్​కు చేరుకున్నారు. కానీ బాలుడిని చూసేందుకు యాజమాన్యం ఒప్పుకోలేదు! కొద్దిసేపు జరిగిన నిరసనల తర్వాత చివరికి బాలుడిని అప్పజెప్పారు కాలేజీ సిబ్బంది.

తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడి నుంచి సైఫై ప్రాంతంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతున్న క్రమంలో.. బాలుడు, టీచర్​ గురించి కొన్ని విషయాలు తండ్రికి చెప్పాడు. 'టీచర్​ నన్ను చాలా సార్లు బెదిరించాడు. కులం పేరుతో దూషించాడు,' అని తండ్రికి చెప్పాడు నిఖిల్​.

కాగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న నిఖిల్​.. సోమవారం మరణించాడు.

ఘటనపై స్థానికులు, బాలుడి కుుటంబసభ్యులు తీవ్రంగా స్పందించారు. నిరసనకు దిగారు. ఫలితంగా వైషోలి గ్రామంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు ఔరయా పోలీసులు. టీచర్​ను అరెస్ట్​ చేయాలంటూ.. భీమ్​ ఆర్మీ సభ్యులు గ్రామంలో నిరసనలు చేపట్టారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అశ్విన్​ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతను అప్పటికే పారిపోయాడు! అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు కాలేజీకి వెళ్లిన పోలీసులు.. క్లాస్​రూమ్​ను, సంబంధిత ఆన్సర్​ షీట్లు ఉన్న గదిని సీజ్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.