పాక్ జెండాను దించేసి తమ జెండా ఎగరేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ-baloch liberation army hoisted balochistan flag and takes down pakistan flag know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాక్ జెండాను దించేసి తమ జెండా ఎగరేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

పాక్ జెండాను దించేసి తమ జెండా ఎగరేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

Anand Sai HT Telugu

బలూచిస్థాన్ గ్రూపులు బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రదేశాల్లో బలూచిస్థాన్ జెండాలను కూడా ఎగురవేశారు.

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

పాకిస్థాన్‌ దాడి ప్రయత్నాలను భారత్‌ తిప్పికొడుతోంది. అయితే ఈలోగా ఆ పాక్‌లో కొత్త విపత్తు వచ్చి పడింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ ఇప్పుడు తిరుగుబాటును తీవ్రతరం చేసింది. తిరుగుబాటు సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు కూడా స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేసే అవకాశం కోసం చూస్తున్నారు.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ తిరుగుబాటు సంస్థలకు చెందిన మూడు గ్రూపులు ప్రకటించాయి. ఈ ప్రదేశాల్లో బలూచిస్థాన్ జెండాలను కూడా ఎగురవేశాయి. పాకిస్థాన్ జెండాలను దించి బలూచిస్థాన్ జెండాలను ఎగురవేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గురువారం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రెండు చోట్ల పాక్ సైన్యంపై దాడులు చేసింది. వీటిలో ఒకటి రిమోట్ బాంబు దాడి, దీనిలో సైనిక వాహనాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో 12 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ వీడియోను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తన సోషల్ మీడియా ఛానల్ హక్కల్ టీవీలో షేర్ చేసింది. గత కొన్నేళ్లుగా బలూచ్ గ్రూపులు పాక్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేసినప్పటికీ గత వారం రోజులుగా దాడులు ఊపందుకున్నాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా అవకాశంగా మలుచుకున్నారు. పాకిస్థాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తున్నారు.

గత రెండు రోజుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌పై పలు దాడులకు పాల్పడింది. క్వెట్టా అంతటా పలు చోట్ల కాల్పులు జరిగాయి. బలూచ్ రచయిత మీర్ యార్ బలోచ్ ఎక్స్‌లో ఇలా రాశారు. 'బలూచ్‌లు తమ జెండాలను ఎగురవేయడం ప్రారంభించారు. పాక్ జెండాలను కిందకు దించుతున్నారు. పాకిస్థాన్‌లోని రాయబార కార్యాలయాలను మూసివేసి కొత్త దేశమైన బలూచిస్థాన్‌కు తరలివెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్‌కు వీడ్కోలు, బలూచిస్థాన్‌కు స్వాగతం.' అని మీరు రాశారు.

బలూచిస్థాన్‌లో తమ ప్రభుత్వం, సైన్యం నియంత్రణ అంతమవుతోందని పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ అన్నారు. బలూచిస్థాన్‌లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ప్రభుత్వం, సైన్యంలోని సీనియర్లు చాలా దూరం వెళ్లలేరని అబ్బాసీ అన్నారు. అంతేకాదు బలూచిస్థాన్ గురించి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సవాలు చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.