Mamata new team | మమత టీంలో కొత్త ముఖాలు
పశ్చిమ బెంగాల్ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇటీవలి అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ మంత్రివర్గ విస్తరణ అని బీజేపీ విమర్శించింది.
Mamata new team | తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం అనూహ్యంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బీజేపీ నుంచి టీఎంసీలోకి వచ్చిన బాబుల్ సుప్రియోకు కేబినెట్ హోదాతో మంత్రి పదవి కల్పించారు.
ట్రెండింగ్ వార్తలు
Mamata new team | మొత్తం 9 మందికి..
తాజా మంత్రివర్గ విస్తరణలో సీఎం మమత కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు. వారిలో ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో ఒకరు. సుప్రియో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి టీఎంసీలో చేరారు. సుప్రియో గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బాబుల్ సుప్రియో కాకుండా స్నేహసిస్ చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మన్ లకు మమత కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు. బిర్బహ హండ్స, విప్లవ్ రాయ్లను సహాయ మంత్రులుగా నియమించారు.
Mamata new team | పార్థ చటర్జీ తొలగింపు తరువాత..
టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్షలో భారీ అవినీతి కుంభకోణం బయటపడడంతో మమత మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి పార్థ చటర్జీని కేబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహించిన శాఖలను అప్పటినుంచి సీఎం మమత తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. తాజా, మంత్రివర్గ విస్తరణలో ఆమె ఆ శాఖలను ఇతర మంత్రులకు అప్పగించనున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం మంత్రివర్గంలో మార్పులు చేయడం ఇదే ప్రథమం. అయితే, అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మమత మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విపక్ష బీజేపీ విమర్శించింది.