Baba Siddique : ముంబై నడిబొడ్డున దారుణం- కీలక నేత బాబా సిద్దిఖీ కాల్చివేత! శరీరంలోకి 6 బుల్లెట్​లు..-baba siddique shot dead how attackers targeted ncp leader in heart of mumbai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Baba Siddique : ముంబై నడిబొడ్డున దారుణం- కీలక నేత బాబా సిద్దిఖీ కాల్చివేత! శరీరంలోకి 6 బుల్లెట్​లు..

Baba Siddique : ముంబై నడిబొడ్డున దారుణం- కీలక నేత బాబా సిద్దిఖీ కాల్చివేత! శరీరంలోకి 6 బుల్లెట్​లు..

Sharath Chitturi HT Telugu
Oct 13, 2024 05:37 AM IST

Baba Siddique shot dead : ముంబై నడిబొడ్డున జరిగిన దారుణ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. మహారాష్ట్ర కీలక నేత బాబా సిద్దిఖీని బాంద్రాంలో ముగ్గురు దుండగులు కాల్చి చంపేశారు. ఆయన శరీరంలో ఆరు బుల్లెట్​లు కనిపించాయి.

బాబా సిద్దిఖీ
బాబా సిద్దిఖీ

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ- అజిత్​ పవార్​ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. హిందీ చిత్ర పరిశ్రమలో సంబంధాలున్న హై-ప్రొఫైల్ పొలిటీషియన్ సిద్ధిఖీని విజయ దశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే తెలిపారు.

“ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ నాకు చెప్పారు. ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హరియాణాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పారు,” అని ఏక్​నాథ్​ షిండే తెలిపారు.

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​ ఆసుపత్రికి వెళ్లి బాబా సిద్దిఖీ కుటుంబాన్ని పరామర్శించారు. తన సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై అజిత్​ పవార్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాణసంచా పేల్చే సమయంలో..

విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై దాడి జరిగింది. మీడియా కథనాల ప్రకారం రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిఖీ టపాసులు పేల్చుతుండగా ముగ్గురు దుండగులు ముఖానికి కండువా కప్పుకుని వాహనం నుంచి బయటకు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఎన్​సీపీ నేత కడుపు, ఛాతీలోకి ఆరు బుల్లెట్​లు దూసుకెళ్లాయి. ఇది గమనించిన వారు సిద్ధిఖీని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

బాబా సిద్దిఖీని దుండగులు ఎందుకు చంపారు? ఎవరైనా ఆయన్ని చంపించారా? దీని వెనుక ఎవరున్నారు? వంటి ఎన్నో ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ వీటిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ఈ ఘటనలో బాబా సిద్దిఖీ సహచరుడికి కూడా గాయాలయ్యాయని సమాచారం.

బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిఖీ ఈ ఏడాది మార్చ్​లో కాంగ్రెస్​ని వీడి ఎన్​సీపీలో చేరారు. సిద్ధిఖీ 2000 ప్రారంభంలో కాంగ్రెస్-అవిభాజ్య ఎన్​సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఈ దాడి అత్యంత దురదృష్టకరమని, ఖండించదగినదని ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అభివర్ణించారు. మైనార్టీలు, లౌకికవాదం కోసం పోరాడిన నాయకుడిని కోల్పోయామని ఎన్​సీపీ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

మరోవైపు నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై పలువురు ప్రతిపక్ష నేతలు ఏక్​నాథ్ షిండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

'బాబా సిద్ధిఖీని కాల్చి చంపారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. @zeeshan_iyc నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబం ఈ క్లిష్ట సమయంలో చాలా శక్తిని పొందాలని కోరుకుంటున్నాను. నగరంలో జరుగుతున్న ఈ అరాచకం ఆమోదయోగ్యం కాదు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలి, " అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఘన జరగడం కలకలం రేపుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.