పాకిస్థాన్ వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత పలువురు ఉగ్రవాదులు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని అడ్డుకుని ఎదురుదాడికి దిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ దాడిలో 9 మంది మరణించారు. 25 మందికి గాయాలు అయ్యాయి.
ఉగ్రవాదులు గేటును పేల్చి కంటోన్మెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అయితే ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించారు.
బన్ను జిల్లా పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయి. అమెరికా, నాటో దళాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ తాలిబన్లకు మద్దతు ఇచ్చిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత వహించింది. ఈ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్లోని అనేక వర్గాలలో ఒకటి. తమ ఫైటర్లు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకుని దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆ బృందం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పెద్ద పెద్ద పొగలు కనిపించడంతో పాటు బ్యౌక్గ్రౌండ్లో తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఈ దాడిపై స్థానిక యంత్రాంగం, పాక్ ఆర్మీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భద్రతా దళాలు ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సంబంధిత కథనం