పాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఆత్మాహుతి దాడి.. పేలుడు పదార్థాలతో ఉన్న కార్లు ఢీ.. 9 మంది మృతి-at least 9 killed and 25 injured after suicide bomb attack on cantonment in pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఆత్మాహుతి దాడి.. పేలుడు పదార్థాలతో ఉన్న కార్లు ఢీ.. 9 మంది మృతి

పాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఆత్మాహుతి దాడి.. పేలుడు పదార్థాలతో ఉన్న కార్లు ఢీ.. 9 మంది మృతి

Anand Sai HT Telugu

Pakistan Attack : పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించింది.

పాకిిస్థాన్‌లో ఉగ్రదాడి

పాకిస్థాన్ వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత పలువురు ఉగ్రవాదులు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని అడ్డుకుని ఎదురుదాడికి దిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ దాడిలో 9 మంది మరణించారు. 25 మందికి గాయాలు అయ్యాయి.

ఎదురుకాల్పులు

ఉగ్రవాదులు గేటును పేల్చి కంటోన్మెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అయితే ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించారు.

ఎవరు దాడి చేశారంటే?

బన్ను జిల్లా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయి. అమెరికా, నాటో దళాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ తాలిబన్లకు మద్దతు ఇచ్చిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత వహించింది. ఈ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌లోని అనేక వర్గాలలో ఒకటి. తమ ఫైటర్లు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకుని దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆ బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

గాలింపు చర్యలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పెద్ద పెద్ద పొగలు కనిపించడంతో పాటు బ్యౌక్‌గ్రౌండ్‌లో తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఈ దాడిపై స్థానిక యంత్రాంగం, పాక్ ఆర్మీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భద్రతా దళాలు ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.