ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనిక చర్య గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజకీయ పార్టీల నాయకులకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ అనేది "కొనసాగుతున్న ఆపరేషన్" అని స్పష్టం చేశారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులకు సంబంధించిన వివరాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ను ప్రస్తుతానికి పంచుకోలేమని చెప్పారు. ఈ భేటీకి వివిధ పార్టీల నాయకులతో పాటు హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు.
ఆపరేషన్ సిందూర్ కోడ్ నేమ్ తో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది చోట్ల జరిగిన ఆపరేషన్ గురించి ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పరిస్థితిని మరింత దిగజార్చడం భారత్ కు ఇష్టం లేదని, అయితే పాకిస్తాన్ ఏదైనా చేస్తే తాము వెనక్కి తగ్గబోమని రాజ్ నాథ్ చెప్పినట్లు తెలిసింది.
ఉగ్రవాదం అంతానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అఖిల పక్ష భేటీలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆపరేషన్ గురించి, ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ఆయన నేతలకు వివరించారు. ‘‘ఇతర నేతలు కూడా మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చి పరిణతి ప్రదర్శించారు. దేశం తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్న సమయంలో, రాజకీయాలకు ఆస్కారం లేదు’’ అని రిజిజు అన్నారు. పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశం జరిగిందని రిజిజు తెలిపారు.
కాగా, ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాలేదు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ కన్నా ప్రధాని ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘గత సందర్భంలో కూడా ఆయన హాజరు కాలేదు. ఈసారి కూడా రాలేదు. తాను పార్లమెంటుకు అతీతుడినని అనుకోవడం ఆయన ఉద్దేశం కావొచ్చు. సమయం వచ్చినప్పుడు అడుగుతాం. కానీ ఇప్పుడు ఇది సంక్షోభ సమయం, మేము ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. "కానీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న తమ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించి ఉంటే బాగుండేది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. అలాగే, సమాజ్ వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, బీజేడీ నుంచి సస్మిత్ పాత్రా, సీపీఎం నుంచి జాన్ బ్రిటాస్ తదితరులు హాజరయ్యారు. జేడీయూ నేత సంజయ్ ఝా, కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని, టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న అనాగరిక ఉగ్రదాడికి భారత్ 'ఆపరేషన్ సిందూర్ 'ను విజయవంతంగా నిర్వహించి ప్రతీకారం తీర్చుకున్న మరుసటి రోజే ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1.04 గంటల నుంచి 1.30 గంటల వరకు కొనసాగిన ఆపరేషన్ సింధూర్ కింద భారత సాయుధ దళాలు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి.
టాపిక్