ాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద గ్రూపులపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ను అరెస్టు చేశారు. అలీ ఖాన్ మహ్మదాబాద్ను ఢిల్లీలో అరెస్టు చేశారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాయ్ పీటీఐకి తెలిపారు.
'ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ను తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మాకు తెలిసింది. కేసు వివరాలను నిర్ధారించే ప్రక్రియలో ఉన్నారు. దర్యాప్తులో పోలీసులు, స్థానిక అధికారులకు విశ్వవిద్యాలయం పూర్తిగా సహకరిస్తూనే ఉంటుంది.' అని అశోకా విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. ఆయన వ్యాఖ్యలు భారత సాయుధ దళాలలోని మహిళా అధికారులను అణగదొక్కేవని, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టాయని కమిషన్ ఒక నోటీసులో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మహిళా అధికారులను విలేకరుల సమావేశానికి పంపడం బూటకమని అలీఖాన్ వ్యాఖ్యానించారు. మరికొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి అలీఖాన్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. మహిళా కమిషన్ తన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకుందని అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ఇంతకుముందు అన్నారు. మహిళా కమిషన్ తన అధికార పరిధిని అతిక్రమిస్తూ, నా పోస్ట్లను తప్పుగా చదివి తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను ఆశ్చర్యపోతున్నానని చెప్పారు.
అలీఖాన్ అశోకా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, రాజకీయ వ్యాఖ్యాత, కాలమిస్ట్. కేంబ్రిడ్జి నుంచి పీహెచ్డీ చేశారు. పొలిటికల్ సైన్స్, హిస్టరీలో డిగ్రీ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులతో చిక్కుల్లో పడ్డారు.