Article 370 verdict LIVE Updates : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 70 రద్దుపై సోమవారం ఉదయం కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలికమే అని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. స్వయంప్రతిపత్తిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చిందని పేర్కొంది.
2019 ఆగస్ట్లో జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్రం. అనంతరం ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ సమయంలో.. జమ్ముకశ్మీర్లో అలజడులు నెలకొన్నాయి. అనంతరం.. కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. అనేక విపక్ష పార్టీలు సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వాటిపై గత కొంతకాలంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్లో తీర్పును రిజర్వ్లో పెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెల్లడించింది.
Supreme court Article 370 verdict : "ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన విధించడం) కింద కేంద్ర తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు. అలాకాకుండా.. ప్రతిదీ సవాలు చేయగలిగితే.. గందరగోళం నెలకొంటుంది. అదే విధంగా.. రాష్ట్రపతి తన అధికారాల్ని ఉపయోగించుకుని, జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంలో తప్పు లేదని రాజ్యాగం చెబుతోంది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక సదుపాయం. ఆ ప్రాంతంలో నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో ఆ తాత్కాలిక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. జమ్ముకశ్మీర్కి ఉన్న అంతర్గత సార్వభౌమాధికారం విభిన్నమైనది కాదు," అని తీర్పును వెలువరించిన సమయంలో వ్యాఖ్యానించారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
అదే సమయంలో.. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్కి వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. 2024 సెప్టెంబర్ 30లోపు.. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
Article 370 verdict latest news : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీనగర్ సహా కశ్మీర్ లోయలోని అనేక చోట్ల అదనపు భద్రతను మోహరించారు. మరోవైపు.. ఆ ప్రాంతంలోని రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇంటికి పోలీసులు తాళం వేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు.
సంబంధిత కథనం