ారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత రెండు రాత్రులు భారత్ పై డ్రోన్తో దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించగా అది విఫలం అయింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ పై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా పరిగణించి తదనుగుణంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పాక్ ఉగ్రవాద దాడులను భారత్ ఇకపై సహించబోదని ప్రభుత్వ నిర్ణయం స్పష్టం చేసింది. ఇప్పటికైనా పాక్ ఉగ్రదాడులను విరమించుకోకపోతే భారత్ దాన్ని యుద్ధంగా భావించి కఠినంగా వ్యవహరిస్తుంది. ఏప్రిల్ 22న పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడింది. ఇందులో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భారత పర్యాటకులను తమ మతాన్ని అడిగి మరి కాల్చారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులను చనిపోయినట్టుగా సమాచారం. కానీ పాక్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
కానీ పలువురు కీలక ఉగ్రవాదుల అంత్యక్రియల్లో మాత్రం పాక్ అధికారులు పాల్గొన్నారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా ఈ దాడిలో హతమయ్యారు. భారత్ చర్యతో ఆగ్రహించిన పాకిస్థాన్ గురువారం రాత్రి జమ్మూ సహా పలు నగరాల్లో 400 టర్కీ డ్రోన్లతో దాడి చేసింది. అయితే భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశంలో ఈ దాడులను తిప్పికొట్టింది.
ఆ తర్వాత శుక్రవారం రాత్రి మరోసారి భారత్లోని 26 నగరాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇది కూడా విఫలం అయింది. భారత్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాక్ ప్రయత్నించింది. గత రాత్రి పాకిస్థాన్కు చెందిన ఆరు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రతీకారం తీర్చుకుంది.