తీవ్ర విషాదం! కల్తీ మద్యానికి 15 మంది బలి-amritsar hooch tragedy 15 dead a dozen critical death toll likely to rise ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తీవ్ర విషాదం! కల్తీ మద్యానికి 15 మంది బలి

తీవ్ర విషాదం! కల్తీ మద్యానికి 15 మంది బలి

Sharath Chitturi HT Telugu

పంజాబ్​ అమృతసర్​లో కల్తీ మద్యానికి 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

కల్తీ మద్యానికి 15 మంది బలి

పంజాబ్​ అమృత్​సర్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మజితా బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది?

బాధితుల్లో ఎక్కువ మంది బ్లాక్​లోని భంగలి కలాన్, తరివాల్, సంఘా, మరారీ కలాన్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అమృత్​సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

అమృత్​సర్ డీసీ సాక్షి సాహ్ని ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించి మృతుల సంఖ్యను ధృవీకరించారని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

“వీరంతా ఆదివారం సాయంత్రం ఒకే సోర్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరిలో కొందరు సోమవారం ఉదయం మృతి చెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కొందరు ఈ విషయాన్ని దాచిపెట్టి బాధితులు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. మరణాలపై సోమవారం అర్థరాత్రి మాకు సమాచారం అందింది,” అని మజితా ఎస్​హెచ్​ అబ్​తాబ్ సింగ్ తెలిపారు.

“ఇప్పటివరకు 10కిపైగా మంది చనిపోయారు. అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మృతుల సంఖ్య పెరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టాము. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది,” అని అమృత్​సర్​ డిప్యూటీ కమిషనర్​ వెల్లడించారు.

రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు చేశామని, ప్రధాన సరఫరాదారులు ప్రభ్​జిత్ సింగ్, సాహిబ్ సింగ్​లను రాజసంసిలో అరెస్టు చేశామని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. సరఫరాదారుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు పంపిణీ చేసిన మరో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసినట్టు అధికారులు వివరించారు.

అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలు ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు ప్రారంభించాయి.

కల్తీ మద్యంతో రాష్ట్రం విలవిల..

ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని తార్న్ తరన్, అమృత్ సర్, గురుదాస్​పూర్ జిల్లాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 2020 జులై, ఆగస్టు నెలల్లో మాఝా ప్రాంతంలోని మూడు జిల్లాలైన తార్న్ తరన్, గురుదాస్పూర్, అమృత్​సర్​లో కల్తీ మద్యం సేవించి సుమారు 130 మంది మరణించగా, డజను మంది చూపు కోల్పోయారు. ఒక్క తార్న్ తరన్ జిల్లాలోనే 80 మంది మరణించడం గమనార్హం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.