MP girl kidnap : యువతి చెప్పిన కిడ్నాప్ ‘కథ’కు పోలీసులే షాక్ అయ్యారుగా..!
MP girl kidnap : తాను కిడ్నాప్ అయినట్టు ఓ యువతి.. తన తండ్రికి కాల్ చేసి చెప్పింది. భయంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిని పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని షాక్కు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
MP girl kidnap : పరీక్షలో ఫెయిల్ అవుతున్న విద్యార్థుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇంకొందరు మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే.. మధ్యప్రదేశ్లో డిగ్రీ పరీక్షలో విఫలమైన ఓ యువతి చేసిన పని చూసి.. పోలీసులే షాక్ అయ్యారు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఇండోర్లో ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివాసముంటోంది. స్థానిక కాలేజీలో ఆమె బీఏ మొదటి సంవత్సరం చదువుకుంటోంది.
కాగా.. శుక్రవారం రాత్రి.. యువతి తండ్రి పోలీసుల వద్దకు వెళ్లాడు. తన బిడ్డను ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశాడు.
MP girl kidnap case : "కాలేజీ నుంచి తిరిగొస్తుండగా.. నా కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయం నా కూతురే చెప్పింది. 'నా సర్ నన్ను గుడి దగ్గర దింపారు. నేను ఆటో ఎక్కి ఇంటికి వద్దామని అనుకున్నాను. కానీ ఆటో డ్రైవర్ నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నా నోటిలో గుడ్డ కుక్కి, కొట్టాడు. కొంత సేపటికి నేను స్పృహ కోల్పోయాను నాన్న. ఆ తర్వాత వేరే వ్యక్తి ఫోన్ నుంచి నీకు కాల్ చేస్తున్నాను,' అని నా కూతురు నాకు చెప్పింది," అని ఆ తండ్రి బాధతో పోలీసులకు వివరించాడు.
ఘటనపై తక్షణమే స్పందించారు పోలీసులు. యువతిని రక్షించేందుకు రంగంలోకి దిగిన అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు యువతి ఫొటోను పంపించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. శుక్రవారం రాత్రి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన దృశ్యాలను చూసి షాక్నకు గురయ్యారు.
Madhya Pradesh latest news : మరోవైపు పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. యువతిని ఉజ్జెయిన్లోని ఓ రెస్టారెంట్లో గుర్తించినట్టు ఫోన్లో చెప్పారు. అంటే.. ఇండోర్ నుంచి 50కి.మీల దూరం. యువతిని ఉజ్జెయిన్ నుంచి వెంటనే ఇండోర్కు తీసుకొచ్చారు.
పరీక్షలో విఫలమవ్వడంతో..
ఆ యువతిని ఇండోర్కు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఆమెను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ అంశాన్ని లేవనెత్తారు. తాను ఆటో ఎక్కినట్టు యువతి చెప్పిందని, కానీ సీసీటీవీ ఫుటేజ్లో అలాంటిదేమీ లేదని పోలీసులు ముందే గుర్తించి, ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే యువతి అసలు విషయాన్ని బయటపెట్టింది.
Madhya Pradesh crime news : "నేను బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పరీక్ష ఫలితాలు శుక్రవారం వచ్చాయి. నేను ఫెయిల్ అయ్యాను. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారు, కొడతారు. నాకు భయం వేసింది. అందుకే కిడ్నాప్ అయినట్టు నేను చెప్పాను," అని పోలీసుల వద్ద నిజం చెప్పేసింది ఆ యువతి.
యువతి బ్యాగులో ఇండోర్ నుంచి ఉజ్జెయిన్ వెళ్లిన బస్సు టికెట్, రెస్టారెంట్ బిల్లును పోలీసులు పరిశీలించారు. అనంతరం ఓ మహిళా పోలీసు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి తప్పును మరోమారు రిపీట్ చేయవద్దని సూచించారు. అనంతరం యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
సంబంధిత కథనం