Shraddha murder case: ఆ ఒక్క క్లూతో హంతకుడు దొరికాడు
Shraddha aftab news: చంపేశాడు. శవాన్ని 35 ముక్కలుగా చేశాడు. తీసుకెళ్లి అడవిలో పడేశాడు. ఆనవాళ్లు లేకుండా చేశాడు. కానీ…
శ్రద్ధా వల్కర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా, తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా జాగ్రత్త పడ్డాడు. తన సహజీవన భాగస్వామి అయిన శ్రద్ధ తనతో గొడవ పడి మే 22న తనను వదిలేసి వెళ్లిందని తొలుత ఆఫ్తాబ్ పోలీసులకు బుకాయించాడు. వెళ్లినప్పుడు ఆమెతోపాటు మొబైల్ కూడా ఉందని చెప్పాడు. పోలీసుల విచారణలో ఎలాంటి అనుమానం రాకుండా నడుచుకున్నాడు. అతడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తపం కూడా కనిపించనివ్వలేదు.
ట్రెండింగ్ వార్తలు
భౌతికంగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించనివ్వకుండా ఆఫ్తాబ్ జాగ్రత్త పడ్డాడు. కానీ అతడు ఆన్లైన్లో చేసిన తప్పిదం పోలీసులకు క్లూగా మారింది. కేసులో చిక్కుముడి వీడడానికి ఇదే కారణమైంది. మే 18న శ్రద్ధను చంపేసిన ఆఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ఈ విషయం 6 నెలల తరువాత వెలుగులోకి వచ్చింది. బాడీని ముక్కలుగా చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు.
కానీ పోలీసుల తదుపరి దర్యాప్తులో శ్రద్ధ బ్యాంక్ ఖాతా నుంచి నెట్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మే 26న రూ. 54 వేలు ఆఫ్తాబ్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయినట్టు తేలింది. మే 22న గొడవ పడి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి తనతో కాంటాక్ట్లో లేదని చెప్పిన ఆఫ్తాబ్ వాంగ్మూలంతో ఈ సాక్ష్యం విభేదిస్తోంది. బ్యాంక్ లావాదేవీ జరిగిన ప్రాంతం మెహ్రౌలీగా పోలీసులు గుర్తించారు.
మరో క్లూ కూడా పోలీసుల దర్యాప్తులో లభించింది. మే 31వ తేదీన శ్రద్ధా ఇన్స్ట్రాగ్రామ్ ఖాతా నుంచి చాట్ చేసినట్టు ఆధారం లభించింది. ఆ లొకేషన్ కూడా మెహ్రౌలీగా తేలింది. ఈ క్లూ ఆధారంగా పోలీసులు శ్రద్ధ తన ఫోన్ను నీ దగ్గర వదిలేసి వెళ్లిందా? అని ఆఫ్తాబ్ను ప్రశ్నించారు. దీంతో ఆఫ్తాబ్ నిజం ఒప్పుకున్నాడు. మే 18న తమ ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగిన నేపథ్యంలో శ్రద్ధ వల్కర్ను తాను చంపేసినట్టు చెప్పాడు.
మహారాష్ట్ర పోలీసులు ఆఫ్తాబ్ను రెండుసార్లు విచారణకు పిలిచారు. అక్టోబరులో ఒకసారి, నవంబరు 3న మరోసారి విచారణకు పిలిచారు. పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినా తామిద్దరం ఇప్పుడు కలిసి లేమని, శ్రద్ధ తనను వదిలి వెళ్లిందని బుకాయిస్తూ వచ్చాడు. పూర్తిగా నమ్మబలికాడు. అతడి ముఖంలో బాధ గానీ, పశ్చాత్తాపం గానీ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.
నేరం చేసినట్టు ఒప్పుకున్న ఆఫ్తాబ్ తను శ్రద్ధను ఎలా చంపాడో వివరించాడు. డెడ్ బాడీని 35 ముక్కలుగా చేశానని, వాసన రాకుండా ఉండేందుకు కొత్త ఫ్రీజర్ కొని తెచ్చానని చెప్పాడు. రాత్రి పూట శరీర భాగాలను అటవీ ప్రాంతంలో పడేసినట్టు చెప్పుకొచ్చాడు. వెబ్ సిరీస్ డెక్స్టర్ నుంచి స్ఫూర్తి పొందినట్టు చెప్పాడు. శరీరాన్ని ఎలా కట్ చేయాలి వంటి అంశాల కోసం గూగుల్లో వెతికినట్టు చెప్పాడు. చంపడానికి వారం రోజుల ముందే చంపేందుకు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.
కాగా ప్రస్తుతం ఆఫ్తాబ్ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియడం లేదు. కొన్ని వారాల క్రితం ముంబైలోని తమ నివాసాన్ని వదిలి వెళ్లారు. ఆ సమయంలో వారికి ఆఫ్తాబ్ సాయం చేశాడు.
సంబంధిత కథనం