Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Firozabad fire accident: ఉత్తర ప్రదేశ్లో ఓ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Firozabad fire accident:ఘోర అగ్నిప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలితీసుకుంది. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కింది అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ షాప్లో మంటలు మొదలవటంతో క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో ప్రమాదం తీవ్రమైంది.
ట్రెండింగ్ వార్తలు
ఫిరోజాబాద్ జిల్లా పరిధిలోని పదమ్ పట్టణం జర్సానా ప్రాంతంలో ఉన్న భవనంలో షార్ట్ సర్ట్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎలక్ట్రానిక్ షాప్ ఉండగా.. తొలి అంతస్తులో యజమాని కుటుంబం ఉందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఆ ఫ్యామిలీకి చెందిన ఆరుగురు చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని సీనియర్ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ తివారీ తెలిపారు.
పరిహారం ప్రకటించిన సీఎం
అగ్నిప్రమాద ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
18 అగ్నిమాపక వాహనాలతో..
18 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేసినట్టు ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ తివారి చెప్పారు. అగ్రా, మెయిన్పురి, ఈత్, ఫిరోజాబాద్ నుంచి 18 అగ్నిమాపక వాహనాలు, 12 పోలీస్ స్టేషన్ల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు తెలిపారు. సుమారు రెండున్నర గంటల పాటు కష్టపడ్డాక మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు ఇంకా సాగుతున్నట్టు తివారి వెల్లడించారు.