Jammu twin blasts : వరుస పేలుళ్లతో ఉలిక్కిపడ్డ జమ్ము.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
Twin blasts in Jammu Kashmir : జమ్ముకశ్మీర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. జమ్ము ప్రాంతంలో జరిగిన ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు.
Twin blasts in Jammu Kashmir : వరుస పేలుళ్లతో జమ్ముకశ్మీర్ ఉలిక్కిపడింది! జమ్ము రైల్వేస్టేషన్కు సమీపంలో శనివారం ఉదయం ఈ పేలుళ్లు సంభవించాయి. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో ఉండటంతో.. తాజా పరిణామాల మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
15 నిమిషాల వ్యవధిలో..
జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగినట్టు జమ్ము అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేష్ సింగ్ తెలిపారు. రెండు వాహనాల్లో ఐఈడీలను అమర్చినట్టు, అవి పేలినట్టు మీడియాకు వివరించారు. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడినట్టు, వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు స్పష్టం చేశారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.
Jammu Twin blasts today : పేలుళ్ల నేపథ్యంలో.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వాహనాలను ఆపి, క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
మరోవైపు.. ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ జోడో యాత్ర, రిపబ్లిక్ డే నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్లో ఉన్న ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.
శనివారం ఉదయం 10:45 గంటలకు మొదటి పేలుడు జరిగింది. రీపేరు కోసం వార్క్షాప్కు పంపించిన వాహనంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టు పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత.. జరిగిన మరో పేలుడులో మరో ఇద్దరు గాయాలపాలైనట్టు వివరించారు.
మాజీ ఎమ్మెల్యే నివాసంలో..
జమ్ముకశ్మీర్ పూంచ్లోని ఓ మాజీ ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయలవ్వలేదు.
Jammu explosion today : ఈ పేలుడు ఘటనలో.. సురంకోటె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ గుజ్జర్ నేత చౌదరి మొహమ్మద్ అక్రమ్ కుటుంబసభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేరు.
"ఘటన జరిగినప్పుడు నేను ఇంట్లో లేను. కొద్దిసేపటి తర్వాత నాకు సమాచారం అందింది. శక్తివంతమైన పేలుడు సంభవించిందని తెలిసింది. ఆ తర్వాత కొందరు దుండగులు ఇంట్లోకి కాల్పులు జరిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం, భారత సైన్యం.. మా ఇంటికి వచ్చాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాయి," అని అక్రమ్ తెలిపారు.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాన్ నబీ ఆజాద్కు సంఘీభావంగా.. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు అక్రమ్. కానీ.. ప్రస్తుతం ఆయన ఆజాద్ స్థాపించిన డెమొక్రెటిక్ ఆజాద్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు.
మరోవైపు.. తన ఇంట్లో పేలుడు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అక్రమ్ డిమాండ్ చేశారు.
ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం