అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో నలుగురిని రక్షించి, న్యూజెర్సీలోని ఆసుపత్రికి తరలించారు.
న్యూయార్క్లోని వెస్ట్సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మెరైన్, ల్యాండ్ ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్లు వంటి అత్యవసర సేవలను న్యూయార్క్ హెలికాప్టర్ ప్రమాద స్థలానికి పంపించారు.
హడ్సన్ నదిపై గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో స్పెయిన్లోని సీమెన్స్ అనే కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, వారి ముగ్గురు పిల్లలు మరణించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
ప్రమాదం సమయంలో హెలికాప్టర్ని నడిపిన పైలట్ ఎవరనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
హడ్సన్ నదిలో హెలికాప్టర్ పాక్షికంగా మునిగిపోయినట్లు, శిథిలాల చుట్టూ అనేక పోలీసు పడవలు ఉన్నట్లు హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చెందిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. సమీపంలోని బ్రిడ్జి నుంచి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.
హడ్సన్ నదిలో కూలిపోవడానికి ముందు హెలికాప్టర్ కేవలం 15 నిమిషాలు ముందే టేకాఫ్ అయ్యిందని ఫ్లైట్ రాడార్ తెలిపింది. ఇప్పటికే ఆరుగురు మరణించగా, మరో నలుగురిని బయటకు తీశారు. కాగా, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అని నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు.
న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ నిర్వహిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ డౌన్టౌన్ హెలికాప్టర్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హడ్సన్ నది మీదుగా ఉత్తరంగా వెళ్లిందని న్యూయార్క్ పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు.
వెస్ట్సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోవడంతో పరిసర ప్రాంతాల్లో అత్యవసర వాహనాలు తిరుగుతాయని, ట్రాఫిక్ ఆలస్యమవుతుందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్లో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదం అమెరికాలో చోటు చేసుకున్న అనేక విమానయాన ఘటనల్లో ఒకటి.
అంతకుముందు, వాషింగ్టన్ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు సభ్యులతో వెళ్తున్న ప్యాసింజర్ జెట్ను మరో వాణిజ్య విమానం ఢీకొట్టింది.
మాన్హాటన్పై ఆకాశం సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లు, ప్రైవేట్ వినోద విమానాలు- వాణిజ్య, పర్యాటక విమానాలతో నిండి ఉంటుంది. మాన్హాటన్లో అనేక హెలిప్యాడ్లు ఉన్నాయి. ఇవి బిజినెస్ అఫీషియల్స్, ఇతరులను మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా గమ్యస్థానాలకు తీసుకువెళతాయి.
2009లో హడ్సన్ నదిపై విమానం, టూరిస్ట్ హెలికాప్టర్ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 2018లో ఈస్ట్ నదిలోకి 'ఓపెన్ డోర్' విమానాలను అందించే చార్టర్ హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి చెందడం సహా అనేక ప్రమాదాలు జరిగాయి.
సంబంధిత కథనం