5G spectrum auction: తొలి రోజు ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలం
5G auction: భారత్లో ఫిఫ్త్ జనరేషన్(5G) స్పెక్ట్రమ్ వేలం మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు బిడ్డర్లు ఆచీతూచి వ్యవహరించారు. తొలి రోజు 4 రౌండ్లలో బిడ్డింగ్ కొనసాగింది. 5వ రౌండ్ బిడ్డింగ్ బుధవారం ఉంటుంది. తొలి రోజు మిడ్ బ్యాండ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్లకే ఎక్కువ పోటీ నెలకొన్నది.
5G spectrum auction: నాలుగు సంస్థలు
భారత్లో 5జీ సేవలు అందడానికి రంగం సిద్ధమవుతోంది. మంగళవారం 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. తొలి రోజైన మంగళవారం, నాలుగు రౌండ్ల బిడ్డింగ్ ముగిసే సమయానికి బిడ్ వాల్యూ మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లను అధిగమించిందని టెలీకాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలి రోజు ఎయిర్టెల్, వొడాఫొన్ ఐడియా, రిలియన్స్ జియోతో పాటు ఆదానీ డేటా నెట్వర్క్స్ ఈ వేలంలో పాల్గొన్నాయి. అయితే, బిడ్డింగ్ ప్రక్రియ ముగిసేవరకు ఏ టెలీకాం సంస్థ ఏ బ్యాండ్విడ్త్ స్పెక్ట్రమ్ను, ఎంత మొత్తానికి సొంతం చేసుకుందనే విషయంలో స్పష్టత రాదు. తొలి రోజు 3300 MHz and 26 GHz బ్యాండ్స్కు ఎక్కువ పోటీ నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
5G spectrum auction: ఆగస్ట్ 15 నాటికి..
ఆగస్ట్ 15 వ తేదీనాటికి అలోకేషన్ సహా మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను ముగించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, దేశంలోని ప్రధాన నగరాల్లో 5G సేవలను ఈ సెప్టెంబర్ నాటికి అందించాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, and 26 GHz బ్యాండ్విడ్త్స్ను వేలం వేస్తున్నారు.
5G spectrum auction: 5జీ వేగం ఎంత?
ప్రస్తుత 4జీ స్పీడ్తో పోలిస్తే.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ 5జీ ద్వారా లభిస్తుంది. అంటే, ప్రస్తుతం 5జీబీ డేటా ఉన్న ఒక మూవీని 4జీ టెక్నాలజీ ద్వారా డౌన్లోడ్ చేయడానికి సుమారు 40 నిమిషాలు పడ్తుంది. అలాగే, 3జీలో 2 గంటలు, 2జీలో దాదాపు రెండున్నర రోజులు పడ్తుంది. అదే, 5జీ టెక్నాలజీతో 5 జీబీ మూవీ ని కేవలం 35 సెకండ్లలో డౌన్లోడ్ చేయవచ్చు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ ఆధారిత సేవల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం.
- 5G spectrum auction: కీ పాయింట్స్
- సక్సెస్ఫుల్ బిడ్డర్లకు 20 ఏళ్ల పాటు ఈ స్పెక్ట్రం అందుబాటులో ఉంటుంది.
- ప్రస్తుతం ప్రైవేట్ టెలీకాం ప్లేయర్లలో ఎయిర్టెల్, వొడాఫొన్ ఐడియా, రిలియన్స్ జియోతో పాటు ఆదానీ డేటా నెట్వర్క్స్ కూడా ఈ వేలంలో పాల్గొంటోంది.
- ఈ వేలంలో విజయవంతమైన బిడ్డర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు.
- ప్రస్తుతం మొత్తం 72097.85 మెగాహెర్జ్ట్స్ స్పెక్ట్రమ్ను వేలం వేస్తున్నారు.
- ఈ ఎయిర్వేవ్స్ కు రూ. 4.3 లక్షల కోట్లను రిజర్వ్ ప్రైస్గా నిర్ధారించింది.
- ఈ వేలంలో ఈఎండీ(Earnest Money Deposit - EMD) గా రూ. 21800 కోట్లను టెలీకాం కంపెనీలు చెల్లించాయి. వాటిలో రిలయన్స్ జియో రూ. 14 వేల కోట్లు, ఎయిర్టెల్ రూ. 5,500 కోట్లు, వీఐ రూ. 2200 కోట్లు, ఆదానీ డేటా నెట్వర్క్స్ రూ. 100 కోట్లు చెల్లించాయి.
- ఆగస్ట్ 1 నాటికి 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియతో పాటు అలాట్మెంట్ పూర్తవుతుంది. ఈ సంవత్సరం చివరినాటికి దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించే 5G అందుబాటులోకి వస్తుంది.
- ఇప్పటికే ట్రాయ్ పలు చోట్ల పైలట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్, బెంగళూరు మెట్రో, కాండ్లా పోర్ట్, భోపాల్లోని11ప్రదేశాల్లో 5G సేవలను జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా అందిస్తోంది.