దేశంలో పరీక్షల సీజన్ నడుస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులు రాత్రింపగళ్లు కష్టపడి, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం ఆన్సర్ షీట్స్లో డబ్బులు పెట్టి ‘పాస్ చేయించండి’ అని రాస్తున్నారు. కర్ణాటకలో జరిగిన 10వ తరగతి (సకెండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్) పరీక్షల్లో ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే, విద్యార్థులు ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టడమే కాదు, పాస్ అవ్వకపోతే తన ప్రేమ ఓడిపోతుందని, అందుకైనా పాస్ చేయించండి అని రాయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటక బెళగావిలో విద్యార్థులు రూ. 500 వరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తమ డిమాండ్ని సమర్థించుకునేందుకు అనేక కారణాలు కూడా చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయాలని ఎగ్జామినర్స్కి విజ్ఞప్తి చేశారు.
“పాస్ అయితేనే నేను నా ప్రేమను కొనసాగించగలను,” అని ఒక విద్యార్థి, డబ్బు నోటుతో పాటు ఆన్సర్ షీట్లో రాసుకొచ్చాడు. అంటే, తన రిలేషన్ అతని పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది.
మరో విద్యార్థి కూడా ఇదే తరహాలో రిక్వెస్ట్ చేసి రూ.500 ఆఫర్ చేశాడు. “దయచేసి నన్ను పాస్ చేయండి. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది,” అని ఆ విద్యార్థి పరీక్ష జవాబు పత్రంలో రాశాడు.
మూల్యాంకకుడిని ఒప్పించేందుకు ఓ విద్యార్థి ఇతర రకాల లంచాలు ఇచ్చినట్లు సమాచారం. "ఈ రూ.500తో టీ తాగండి సార్, దయచేసి నన్ను పాస్ చేయండి," అని సమాధాన పత్రంలో అతను రాశాడు.
“మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను,” అని మరో విద్యార్థి రాశాడు.
పరీక్ష ఫలితంపైనే తమ చదువు కొనసాగుతుందని కొందరు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. "మీరు నన్ను పాస్ చేయకపోతే, నా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరు," అని మరొకరు అన్నారు.
కర్ణాటకలో జరిగిన మరో సంఘటన ఇది. శివమొగ్గ జిల్లా ఆదిచుంచనగిరి పీయూ కళాశాల పరీక్షా కేంద్రంలో రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ)కు హాజరయ్యే ముందు కొందరు విద్యార్థులను తమ 'పవిత్ర దారాన్ని' తొలగించాలని అక్కడి సిబ్బంది చెప్పారన్న వివాదంపై ప్రతిపక్ష బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీపై మండిపడుతోంది.
ఈ ఘటన వివాదానికి దారి తీయడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ హామీ ఇచ్చారు.
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులను ఎంపిక చేసేందుకు సీఈటీ నిర్వహిస్తారు.
పవిత్ర దారాన్ని తొలగించాలని విద్యార్థులను కోరిన సీఈటీ పరీక్షా కేంద్రం అధికారులు, ఇద్దరు హోంగార్డులపై కేసు నమోదు చేసి వారిని శనివారం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం