‘ప్రేమ ఓడిపోతుంది మాస్టారు’ -చదువుకుని పాసవండ్రా అంటే.. 10వ తరగతి ఆన్సర్​ షీట్స్​​లో రూ. 500 నోట్లు!-500 to plea for love karnataka students wild offers to examiner over sslc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘ప్రేమ ఓడిపోతుంది మాస్టారు’ -చదువుకుని పాసవండ్రా అంటే.. 10వ తరగతి ఆన్సర్​ షీట్స్​​లో రూ. 500 నోట్లు!

‘ప్రేమ ఓడిపోతుంది మాస్టారు’ -చదువుకుని పాసవండ్రా అంటే.. 10వ తరగతి ఆన్సర్​ షీట్స్​​లో రూ. 500 నోట్లు!

Sharath Chitturi HT Telugu

“మీరు నన్ను పాస్ చేయకపోతే, నా ప్రేమ ఓడిపోతుంది”.. కర్ణాటక 10వ తరగతి పరీక్షల ఆన్సర్​ షీట్స్​లో కనిపిస్తున్న రాతలు ఇవి! కొందరు విద్యార్థులు రూ. 500 వరకు లంచం ఇస్తూ, ఈ విధంగా అభ్యర్థనలు చేస్తున్నారు.

కర్ణాటకలోని ఓ 10వ తరగతి పరీక్షా కేంద్రం (PTI)

దేశంలో పరీక్షల సీజన్​ నడుస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులు రాత్రింపగళ్లు కష్టపడి, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం ఆన్సర్​ షీట్స్​లో డబ్బులు పెట్టి ‘పాస్​ చేయించండి’ అని రాస్తున్నారు. కర్ణాటకలో జరిగిన 10వ తరగతి (సకెండరీ స్కూల్​ లీవింగ్​ సర్టిఫికేట్​) పరీక్షల్లో ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే, విద్యార్థులు ఆన్సర్​ షీట్​లో డబ్బులు పెట్టడమే కాదు, పాస్​ అవ్వకపోతే తన ప్రేమ ఓడిపోతుందని, అందుకైనా పాస్​ చేయించండి అని రాయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అసలేం జరిగిందంటే..

పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటక బెళగావిలో విద్యార్థులు రూ. 500 వరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తమ డిమాండ్​ని సమర్థించుకునేందుకు అనేక కారణాలు కూడా చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయాలని ఎగ్జామినర్స్​కి విజ్ఞప్తి చేశారు.

“పాస్​ అయితేనే నేను నా ప్రేమను కొనసాగించగలను,” అని ఒక విద్యార్థి, డబ్బు నోటుతో పాటు ఆన్సర్​ షీట్​లో రాసుకొచ్చాడు. అంటే, తన రిలేషన్​ అతని పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది.

మరో విద్యార్థి కూడా ఇదే తరహాలో రిక్వెస్ట్ చేసి రూ.500 ఆఫర్ చేశాడు. “దయచేసి నన్ను పాస్ చేయండి. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది,” అని ఆ విద్యార్థి పరీక్ష జవాబు పత్రంలో రాశాడు.

మూల్యాంకకుడిని ఒప్పించేందుకు ఓ విద్యార్థి ఇతర రకాల లంచాలు ఇచ్చినట్లు సమాచారం. "ఈ రూ.500తో టీ తాగండి సార్, దయచేసి నన్ను పాస్ చేయండి," అని సమాధాన పత్రంలో అతను రాశాడు.

“మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను,” అని మరో విద్యార్థి రాశాడు.

పరీక్ష ఫలితంపైనే తమ చదువు కొనసాగుతుందని కొందరు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. "మీరు నన్ను పాస్ చేయకపోతే, నా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరు," అని మరొకరు అన్నారు.

సీఈటీ పరీక్షలో వివాదం..

కర్ణాటకలో జరిగిన మరో సంఘటన ఇది. శివమొగ్గ జిల్లా ఆదిచుంచనగిరి పీయూ కళాశాల పరీక్షా కేంద్రంలో రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ)కు హాజరయ్యే ముందు కొందరు విద్యార్థులను తమ 'పవిత్ర దారాన్ని' తొలగించాలని అక్కడి సిబ్బంది చెప్పారన్న వివాదంపై ప్రతిపక్ష బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీపై మండిపడుతోంది.

ఈ ఘటన వివాదానికి దారి తీయడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ హామీ ఇచ్చారు.

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులను ఎంపిక చేసేందుకు సీఈటీ నిర్వహిస్తారు.

పవిత్ర దారాన్ని తొలగించాలని విద్యార్థులను కోరిన సీఈటీ పరీక్షా కేంద్రం అధికారులు, ఇద్దరు హోంగార్డులపై కేసు నమోదు చేసి వారిని శనివారం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.