కానిస్టేబుల్ పరీక్ష రాసిన దొంగలు.. 36 మంది అరెస్ట్
రాసేది కానిస్టేబుల్ పరీక్ష. కానీ వారంతా గుట్టుగా బ్లూటూత్ పరికరాల ద్వారా కాపీయింగ్కు ప్రయత్నించి దొరికిపోయారు.
గయా (బీహార్): బీహార్లోని గయా జిల్లావ్యాప్తంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష సందర్భంగా బ్లూటూత్ పరికరాలను ఉపయోగించినట్లు అభియోగాలు ఎదుర్కొన్న 36 మంది విద్యార్థులను బీహార్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
‘గయా అంతటా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో బ్లూటూత్ పరికరాలను ఉపయోగించిన 36 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. సంఘటితంగా ఈ తరహా మోసాలకు నడుపుతున్న వ్యక్తులు ఈ పరికరాలను మోహరిస్తారని మాకు ఇప్పటికే సమాచారం ఉంది..’ అని గయా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తులను కోర్టులో హాజరుపరచనున్నారు.
మరో సంఘటనలో లఖింపూర్ ఖేరీకి చెందిన ఒక విద్యార్థి ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (UPSSSC PET)కు మరొక వ్యక్తికి చెందిన అడ్మిట్ కార్డును ఉపయోగించి హాజరైనట్టు ఆదివారం పిలిభిత్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, విద్యార్థిని కూడా అరెస్ట్ చేశామని పిలిభిత్ అడిషనల్ ఎస్పీ పవిత్ర మోహన్ త్రిపాఠి తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
కాగా పీఈటీ -2022 పరీక్షకులకు హాజరయ్యేందుకు వస్తున్న విద్యార్థులు భారీ సంఖ్యలో మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దొరకక ఆగిపోయారు. ఆదివారం తిరిగి తమ ఇళ్లకు వెళుతున్నప్పుడు రద్దీ పెరగడంతో ప్రయాణికులు కొందరు కిటికీల గుండా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
UP PET 2022 పరీక్షా అభ్యర్థులు పరీక్షా కేంద్రాల నుండి తమ ఇళ్లకు తిరిగి వస్తున్న సమయంలో భారీ రద్దీ కారణంగా మొరాదాబాద్ రైళ్లలో ప్రయాణికులు కిక్కరిసిపోయారు. స్టేషన్లోని అభ్యర్థులు ఏఎన్ఐతో మాట్లాడుతూ, ‘రైల్వే స్టేషన్లలో చాలా నిర్వహణ లోపం ఉంది. ప్రయాణిస్తున్నప్పుడు నిరంతరం నిలబడే ఉన్నాం. యంత్రాంగం ద్వారా ఎటువంటి ఏర్పాట్లు లేవు. అకస్మాత్తుగా రైళ్ల ప్లాట్ఫారమ్లు మార్చేశారు..’ అని వాపోయారు.
‘మేం ఘాజీపూర్ నుండి వచ్చాం. మేం వచ్చేటప్పటికి అన్ని బస్సులు, రైళ్లు నిండిపోయాయి. అవి ఇప్పుడు కూడా నిండి ఉన్నాయి. ప్రయాణానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు..’ అని ఘాజీపూర్ నుండి UPSSSC PET అభ్యర్థులు ఏఎన్ఐకి చెప్పారు.