హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం వెల్లడించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ క్షిపణులు, డ్రోన్లను భారత వైమానిక దళం అడ్డుకుంది.
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించిందని భారత్ శుక్రవారం తెలిపింది. భటిండా మిలిటరీ స్టేషన్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక 'పాకిస్థాన్ సాయుధ మానవరహిత వైమానిక వాహనాన్ని పంపారు. ఆ ప్రయత్నాన్ని విఫలం చేశాం.' అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు తెలిపారు.
పాకిస్థాన్ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశం అంతటా నాలుగు వైమానిక రక్షణ స్థావరాలపై భారతదేశం సాయుధ డ్రోన్లను ప్రయోగించిందని, ఒక డ్రోన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థను విజయవంతంగా నాశనం చేసిందని వ్యోమికా చెప్పారు. మే 8, 9 తేదీల మధ్య రాత్రి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ చూసిందని కేంద్రం తెలిపింది.
భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు జరిగాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియే తయారీ డ్రోన్లను ప్రయోగించినట్టుగా కర్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. గత రాత్రి భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలకు భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ప్రతిస్పందించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.