ఒడిశాలో దారుణ, అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 4ఏళ్ల చిన్నారిపై ఓ 27ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దూరపు బంధువు అయిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012లోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు గంజాం పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సువేందు పాత్ర తెలిపారు.
తొలుత అతను చిన్నారికి చాక్లెట్ ఇచ్చాడు. అనంతరం తమ గ్రామంలోని ఓ పండుగకు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. కానీ ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని పడేశాడు.
నేరానికి పాల్పడుతున్న సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.
చిన్నారిపై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం లభించింది. పలువురు సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మరిన్ని ఆధారాలు సేకరించాయి.
అనుమానంతో నిందితుడితో పాటు పలువురిని విచారణకు పిలిచారు. నిందితుడు చిన్నారితో కనిపించాడని, అతను తరచూ ఆ చిన్నారికి చిప్స్, టోఫీలు ఇచ్చేవాడని స్థానికులు చెప్పారని ఎస్పీ తెలిపారు.
“ఏప్రిల్ 25న సాయంత్రం నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలికను ప్రలోభపెట్టే ముందు అతను తన మొబైల్ ఫోన్లో పోర్న్ చూశాడు. మృతదేహాన్ని పడేసిన తర్వాత మళ్లీ మద్యం సేవించాడు,” అని ఎస్పీ తెలిపారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని ఎస్పీ తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఈ దారుణ ఘటనలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న గ్రామస్థులను విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
మరోవైపు 4ఏళ్ల చిన్నారి అత్యాచారం, రేప్ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పసివాళ్లపై అకృత్యాలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సంబంధిత కథనం