Kerala rape case : కేరళ అథ్లెట్ రేప్ కేసు దర్యాప్తునకు 25 సభ్యుల సిట్ టీమ్- 30మంది అరెస్ట్!
Kerala rape case : కేరళలో కలకలం సృష్టించిన అథ్లెట్ రేప్ కేసు దర్యాప్తునకు 25 సభ్యుల సిట్ టీమ్ ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటివరకు 30కిపైగా మందిని అరెస్ట్ చేశారు.
కేరళలో కలకలం సృష్టించిన అథ్లెట్ రేప్ కేసును అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై దర్యాప్తు కోసం 25 మంది సభ్యులతో కూడిన సిట్ టీమ్ని ఏర్పాటు చేసింది. మరోవైపు పత్తనంతిట్ట జిల్లాకు సంబంధించిన ఈ కేసులో ఆదివారం మరో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితంగా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 30 దాటింది.
కేరళ రేప్ కేసు..
కేరళ రేప్ కేసు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితులను పట్టుకోవడం, వారిని ప్రశ్నించడం, అధికారికంగా అరెస్టు చేయడంపై పతనంతిట్ట డీఎస్పీ ఎస్ నందకుమార్ నేతృత్వంలోని సిట్ దృష్టి సారించింది.
బాధితురాలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు చోట్ల వేధింపులకు గురికావడం గురించి మాట్లాడుతూ.. “మేము తేదీలను, సాక్ష్యాలను క్రాస్ చెక్ చేస్తాము. మరిన్ని అరెస్టులు చేపడతాం,” అని ఓ అధికారి తెలిపారు.
జిల్లా స్థాయి అథ్లెట్ అయిన బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో 13 ఏళ్ల వయసు నుంచే తనని, తన పక్కింటి స్నేహితుడితో పాటు 62 మంది వేధింపులకు గురిచేశారని తెలిపింది. కస్టడీలో ఉన్న నిందితుల్లో కొందరు.. కేసు నిందితుల స్నేహితులు. మరి బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె వాంగ్మూలాన్ని పతనంతిట్ట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ రికార్డు చేస్తారని అధికారులు తెలిపారు.
ఓ స్నేహితుడు రికార్డు చేసిన అశ్లీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి ఆమెను బెదిరించి కొన్నేళ్లుగా పదేపదే వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని నిందితుల మధ్య కూడా పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానితులతో మాట్లాడేందుకు తన తండ్రి మొబైల్ ఫోన్ను ఉపయోగించానని బాధితురాలి చెప్పింది. ఫోన్ వివరాలు, ఆమె వద్ద ఉన్న డైరీలోని సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు కనీసం 40 మందిని గుర్తించారు. ఆ స్మార్ట్ఫోన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించామని, గత ఐదేళ్లుగా రాత్రివేళల్లో ఆ నంబర్కు వచ్చిన కాల్స్ వివరాలను సైబర్ సెల్ ట్రాక్ చేస్తోందని తెలిపారు.
కేరళ రేప్ కేసుపై ఇప్పటివరకు నలుగురు మైనర్లు సహా 28 మందిని అదుపులోకి తీసుకుని 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
నిందితుల్లో బాధితురాలి తోటి అథ్లెట్లు, కోచింగ్ సిబ్బంది, ఆటోరిక్షా డ్రైవర్లు సహా స్థానికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
జాతీయ మహిళా కమిషన్ ఈ నేరాన్ని "హేయమైనది" అని పేర్కొంది. మూడు రోజుల్లోగా రాష్ట్ర పోలీసుల నుంచి వివరణాత్మక కార్యాచరణ నివేదికను కోరింది. ఈ కేసుపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నుంచి నివేదిక కోరారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పి.సతీదేవి.
అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) సంబంధిత సెక్షన్లతో పాటు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని వివిధ సెక్షన్లను కూడా పోలీసులు ప్రయోగించినట్లు జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బాధితురాలు మొదట పందళం కుటుంబశ్రీ పరిధిలోని స్నేహిత జెండర్ హెల్ప్డెస్క్కు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, ఆ తర్వాత కోన్నిలోని నిర్భయ షెల్టర్ హోమ్కి తరలించారు. అక్కడ ఆమె తన బాధను సైకాలజిస్టులకు వివరించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
“13 ఏళ్ల వయసు నుంచే ఆ యువతి లైంగిక వేధింపులకు గురైంది. ఇది అసాధారణ కేసు కావడంతో మరింత లోతైన కౌన్సెలింగ్ కోసం ఆమెను సైకాలజిస్ట్ వద్దకు పంపించాము,” అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ స్థానిక న్యూస్ చానెల్కు తెలిపారు.
18 ఏళ్ల బాధితురాలి ప్రవర్తనలో గణనీయమైన మార్పుల గురించి బాధితురాలి ఉపాధ్యాయులు హెచ్చరించడంతో సీడబ్ల్యూసీ కౌన్సెలింగ్ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సంబంధిత కథనం