భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 24 విమానాశ్రయాలు మే 15 వరకు మూసివేత-24 airports to remain closed till may 15 amid india pakistan tensions check out list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 24 విమానాశ్రయాలు మే 15 వరకు మూసివేత

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 24 విమానాశ్రయాలు మే 15 వరకు మూసివేత

Anand Sai HT Telugu

భారత్-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాలను మే 15వరకు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం (HT File)

పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి ఉత్తర భారతదేశంలోని పలు నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తరువాత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. తర్వాత మే 15 ఉదయం వరకు పొడిగించారు. జమ్మూ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించి క్షిపణులు, డ్రోన్లను నిలిపివేశాయి. దీంతో పలు నగరాల్లో వైమానిక దాడుల సైరన్ మోగింది. తర్వాత విమానాశ్రయాలను కూడా మూసివేస్తున్నట్టుగా కూడా ప్రకటన వచ్చింది.

భద్రత కారణంగా

సంబంధిత అధికారుల తాజా ఆదేశాలకు అనుగుణంగా విమానాశ్రయ మూసివేత కారణంగా మే 15న ఉదయం 5.29 గంటల వరకు కింది గమ్యస్థానాలకు వెళ్లే అన్ని విమానాలు రద్దు అవుతాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రకటనలో పేర్కొంది. 'మీ భద్రత మా అత్యంత ప్రాధాన్యతగా ఈ ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి. ఈ పరిస్థితి తర్వాత తిరుగులేని మద్దతును అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం' అని తెలిపింది.

ఈ విమానాశ్రయాలు మూసివేత

చండీగఢ్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, భుంతర్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా-గగ్గల్, బటిండా, జైసల్మేర్, జోధ్ పూర్, బికనీర్, హల్వారా, పఠాన్ కోట్, జమ్మూ, లెహ్, ముంద్రా, జామ్ నగర్, హిరాసా (రాజ్ కోట్), పోర్ బందర్, కేశోద్, కాండ్లా, భుజ్ విమానాశ్రయాలు మే 15 వరకు మూసివేస్తారు.

ఎయిర్ ఇండియా ప్రకటన

ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికులకు సలహా జారీ చేసింది. 'భారతదేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేయడంపై విమానయాన అధికారుల నుండి నోటిఫికేషన్ వచ్చింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్ స్టేషన్లకు బయలుదేరే ఎయిర్ ఇండియా విమానాలు మే 15న ఉదయం 5.29 గంటల వరకు రద్దు అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాలంలో టిక్కెట్లను కలిగి ఉన్న కస్టమర్‌లకు రీషెడ్యూలింగ్ ఛార్జీలపై ఒకేసారి మినహాయింపు లేదా రద్దులకు పూర్తి వాపసు అందిస్తాం' అని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.