Coal Issue : బొగ్గు రవాణా కోసం భారీగా ప్రయాణికుల రైళ్ల రద్దు..
దేశంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, బొగ్గు రవాణా కోసం భారతీయ రైల్వేలు ప్రయణికుల రైళ్లను భారీగా రద్దు చేస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలో దాదాపు రెండు వేల రైళ్లను బొగ్గు తరలింపు కోసం రద్దు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 4వేలకు పైగా ప్రయాణికుల రైళ్లను వివిధ కారణాలతో రద్దు చేశారు.
బొగ్గు కొరతతో దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో రైల్వే శాఖ భారీగా గూడ్స్ రైళ్లను నడపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణికుల రైళ్లను గణనీయంగా రద్దు చేశారు. దేశవ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో ఇలా 1934 సర్వీసుల్ని బొగ్గు రవాణా కోసమే రద్దు చేశారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రకరకాల కారణాలతో 9వేలకు పైగా రైలు సర్వీసులు రద్దయ్యాయి. అయితే అందులో 1934 సర్వీసులు కేవలం బొగ్గు రవాణా కోసం ప్రత్యేక గూడ్స్ రైళ్లను నడపాల్సి రావడంతో గత మూడు నెలల్లో రద్దయ్యాయి. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే శాఖ సమాచారం ఇచ్చింది. కొత్త లైన్ల నిర్మాణం, మరమ్మతులు, సాంకేతిక కారణాలతో 6995 సర్వీసులు గత ఏడాది రద్దయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
మార్చి నుంచి మే మధ్యలో దాదాపు 1934 సర్వీసుల్ని కేవలం బొగ్గు రవాణా చేయడం కోసమే రద్దు చేశారు. రైల్వే లైన్లపై తీవ్ర ఒత్తిడి ఉండటం, విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి గూడ్స్ రైళ్లను నడిపారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉండటంతో ప్రయాణికుల రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.
మరోవైపు సమీప భవిష్యత్తులో భారతీయ రైల్వేలు లక్షా 15వేల కోట్ల వ్యయంతో 58 సూపర్ క్రిటికల్, 68 క్రిటికల్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం ద్వారా మరింత ఉత్పాదక సాధిస్తామని రైల్వే శాఖ చెబుతోంది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో దాదాపు 3,395 మెయిల్, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్త లైన్ల నిర్మాణం, ఆధునీకరణ, ట్రాక్ మరమ్మతుల పేరుతో రైలు సర్వీసుల్ని రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
టాపిక్